బల్దియా V/S మెట్రో.. భారీగా బకాయి పడ్డ మెట్రో
హైదరాబాద్ : మెట్రో, బల్దియా మధ్య వార్ ముదురుతోంది. సవ్యంగా సాగాల్సిన ఈ జోడెద్దుల బండికి అడుగడుగునా ఆటంకాలే. ప్రకటనల చిచ్చు ఈ రెండింటి మధ్య దూరం పెంచుతోంది. బకాయిలు చెల్లించాలంటున్న జీహెచ్ఎంసీ.. స్పందించకుండా మిన్నకుంటున్న మెట్రో.. వెరసి ఈ రెండింటి మధ్య పంచాయితీ ముదురుపాకన పడింది.
మూడేళ్ల బకాయిలు.. చెల్లించింది మాత్రం ఏడాదికే..!
మెట్రో రైల్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మధ్య ప్రకటనల పంచాయితీ రచ్చకెక్కింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం జీహెచ్ఎంసీకీ ఏటా 2 కోట్ల 65 లక్షల రూపాయలు మెట్రో రైల్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారనేది జీహెచ్ఎంసీ అధికారుల వాదన. పోయిన మూడు సంవత్సరాలలో 7 కోట్ల 95 లక్షలకు గాను కేవలం 2 కోట్ల 36 లక్షలు మాత్రమే చెల్లించినట్లుగా తెలుస్తోంది. అంటే మూడేళ్లకు గాను ఒక్క సంవత్సరం బకాయిలు చెల్లించినట్లు లెక్క. ఇంకా రెండేళ్లకు సంబంధించిన మొత్తం చెల్లించాల్సి ఉంది.
అనుమతి గోరంత.. ఆదాయం కొండంత
హైదరాబాద్ మెట్రో కారిడార్ పరిధిలో 876 పిల్లర్లకు ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ 1800 పిల్లర్లకు అడ్వర్టయిజ్మెంట్ బోర్డులు పెట్టినట్లుగా మునిసిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్ కేటగిరీలో మెట్రో ప్రకటనలకు జీహెచ్ఎంసీ ధరలు నిర్ణయించింది. స్క్వేర్ మీటర్ కు 3వేల రూపాయలు, హెర్డింగులకు 15 వందల రూపాయలుగా ధర నిర్ణయించారు. ఈ లెక్కన 876 పిల్లర్లకు లెక్క వేస్తే 2 కోట్ల 65 లక్షల రూపాయలు మెట్రో చెల్లించాల్సి ఉంటుంది. ఇక అనుమతులు తీసుకోని పిల్లర్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఏడాదికి 6 కోట్ల రూపాయలకు పైగానే చెల్లించాల్సి ఉంటుందనేది ఒక అంచనా.
ప్రభుత్వం జోక్యం తప్పదా?
ప్రకటనల రుసుము చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు పట్టుబడుతున్నారు. ఈమేరకు ఎన్ని లేఖలు రాసినా.. మెట్రో రైల్ అధికారులు స్పందించడం లేదని సమాచారం. అంతేకాదు ప్రకటనల రుసుము తగ్గించాలని కోరుతున్నారట. అయితే ఆ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవంటున్నారు మునిసిపల్ అధికారులు. రుసుము విషయంలో ఎలాంటి తగ్గింపులు లేవని ఇదివరకే స్పష్టత ఇచ్చినప్పటికీ.. మెట్రో రైల్ అధికారులు మాత్రం బకాయిలు చెల్లించడం లేదట. దీంతో ఈ విషయంపై సీరియస్ గా దృష్టిసారించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రభుత్వం దగ్గర తేల్చుకోవాలని భావిస్తున్నారట.
ఆదాయం దండిగానే..! మరి బకాయిలు?
మెట్రో కారిడర్ లో ఎక్కడ చూసినా ప్రకటనలే దర్శనమిస్తున్నాయని.. దీంతో మెట్రో రైలుకు భారీగానే ఆదాయం ఉందనేది ఒక అంచనా. యాడ్స్ రూపంలో డబ్బులు బాగానే వస్తున్నా.. జీహెచ్ఎంసీకి మాత్రం బకాయిలు చెల్లించడం లేదట. మరోవైపు ఖజానా ఖాళీ అయి జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రావాల్సిన బకాయిల మీద జీహెచ్ఎంసీ అధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. మెట్రో రైల్ విషయంలో కూడా కొందరు అధికారులు చూసీచూడనట్లు పోతున్నారనే వాదనలున్నాయి. మొత్తానికి బల్దియా VS మెట్రో పంచాయతీ తేలితే కొంతవరకైనా ఆదాయం సమకూరినట్లవుతుంది.