మారిన మెట్రో వేళలు, ఉదయం అరగంట ఆలస్యం, రాత్రి 11 గంటల వరకు, ఎందుకంటే
హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు సమయాన్ని పొడిగించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదివరకు మాదిరిగా ఉదయం 6 గంటల నుంచి కాకుండా 6.30 గంటల నుంచి మెట్రో రైలు నడుస్తాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. రాత్రి 11 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
గమ్యస్థానం నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరిస్టాప్ వద్ద రాత్రి 11.50 గంటలకు ప్రయాణికులకు దింపుతామని పేర్కొన్నారు. మారిన మెట్రో సమయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ఇటీవల ఆర్టీసీ సిటీలో బస్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు ట్రిప్పులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత నష్టాలను తగ్గించడంపై కార్పొరేషన్ దృష్టిసారించింది. నష్టాలొచ్చే రూట్లలో బస్సులను నడపకపోవడమే మంచిదని అధికారులు సూచించడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారు.
దీంతో హైదరాబాద్ నగరంలో వెయ్యి సిటీ బస్సులను రద్దు చేసినట్టు తెలిసింది. శనివారం నుంచి బస్సుల సంఖ్య కూడా తగ్గినట్టు సమాచారం. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో మెట్రో రైలు సేవలను మరింత విసృతం చేశారు. ఈ మేరకు మీడియాకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు.