ఎమ్మెల్సీ రేసులో ఎంఐఎం.. టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మార్చి 12న ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి నలుగురు అభ్యర్థులను ఖరారు చేయగా.. సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు. మిత్రపక్షమైన ఎంఐఎంకు ఒక స్థానం కేటాయించడంతో.. అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. సోమవారం నాడు ఆ పార్టీ అధినేత అభ్యర్థిని ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ను ప్రకటించారు అసదుద్దీన్. ఆయన ప్రస్తుతం డబీర్ పురా కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు.
Happy to inform that Mirza Riyaz ul Hasan Effendi will be the MLC candidate from AIMIM.
— Asaduddin Owaisi (@asadowaisi) February 25, 2019
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం ఎంఐఎంలో తీవ్ర పోటీ నెలకొంది. దానికోసం సీనియర్ నేతలు చాలామంది పోటీపడ్డారు. అయితే అసదుద్దీన్ మాత్రం మీర్జా రియాజ్ వైపే మొగ్గుచూపారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా హోం మంత్రి మహమూద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశంను ఖరారు చేశారు సీఎం కేసీఆర్.
ఎమ్మెల్సీ స్థానాలకు ఖరారు చేసిన నలుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గన్పార్క్లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి నామినేషన్ పత్రాలు సమర్పించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామినేషన్ల పర్వం పర్యవేక్షించారు. నలుగురు అభ్యర్థుల నామినేషన్ బాధ్యతలను ఒక్కో మంత్రికి అప్పగించారు.
హోం మంత్రి మహమూద్ అలీ నామినేషన్ బాధ్యతను మంత్రి తలసానికి.. ఎగ్గె మల్లేశం నామినేషన్ ప్రక్రియను మంత్రి మల్లారెడ్డికి అప్పగించారు. అలాగే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. శేరి సుభాష్ రెడ్డి నామినేషన్ బాధ్యతలను చూడగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ నామినేషన్ బాధ్యతను చూశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున వాటికి ఇబ్బంది కలగకుండా విడతలవారీగా ఎమ్మెల్యేలు వీరి నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.