డెంగ్యూ జ్వరాలు తక్కువే.. ప్రతిపక్ష నేతల రాద్ధాంతం.. అసెంబ్లీలో ఈటల
హైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత తక్కువగానే ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆరోగ్య శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన విపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో విష జ్వరాలు వస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు ఈటల. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారని.. ఆదివారాలు సైతం డ్యూటీలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక డెంగ్యూ జ్వరాల తీవ్రత కూడా తక్కువగానే ఉందని స్పష్టం చేశారు. డాక్టర్లు కూడా అదే విషయం చెబుతున్నారని.. సెలవులు రద్దు చేసుకోవడంతో పాటు సాయంత్రం వేళల్లో కూడా ఔట్ పేషేంట్ సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.
లక్షకు పైగా ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం.. ప్రతిపక్షాల కేసుల వల్లే ఆలస్యం.. బడ్జెట్పై సీఎం వివరణ..!
వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు ఈటల. వైద్యానికి సంబంధించి ఏడు రంగాల్లో తెలంగాణ సమర్థత ఏంటో చూపించామన్నారు. ఇదివరకు జిల్లా స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో ఐసీయూలు గానీ, డయాలసిస్ సేవలు గానీ అందుబాటులో లేవని గుర్తు చేశారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డయాలసిస్ సెంటర్లతో పాటు ఐసీయూ, ట్రామా కేర్ సెంటర్లు కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. ఇదివరకు 30 శాతంగా మాత్రమే ఉన్న ప్రసవాలు ఇప్పుడు 65 శాతానికి పెరగడం అభినందనీయమని అన్నారు. కేసీఆర్ కిట్లు వచ్చాక ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా 12 వేల 289 మంది వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారని చెప్పారు. 2 వేల 272 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసిందన్నారు.