హైదరాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లతో కోవిడ్ మొబైల్ ఐసీయూ ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తయారు చేసిన కరోనా మొబైల్ ఐసీయూను ఈటెల రాజేందర్ ప్రారంభించారు.
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు
ప్రముఖ ఐటీ సంస్థ మైక్రాన్ వంద వెంటిలేటర్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, ప్రభుత్వం మరో 400 వెంటిలేటర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. వెంటిలేటర్ల కోసం ఇప్పటికే ఆర్డర్ పెట్టామని చెప్పారు .
కంటైన్మెంట్లో ఉంటున్న వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల మౌలిక సేవలు అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు వీలుగా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కోవిడ్ ఆస్పత్రికి మార్చినట్లు తెలిపారు. త్వరలో 1500 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి చెప్పారు.
కరోనా పేషెంట్ల కోసం మొబైల్ ఐసీయూ యూనిట్ను ఏర్పాటు చేసిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితోపాటు ఫౌండేషన్ సీఈఓ చిన్నబాబు సుంకవల్లి పాల్గొన్నారు.
కాగా, క్లిష్టమైన సంరక్షణ సౌకర్యాలను ఈ మొబైల్ ఐసీయూలో అందుబాటులో ఉంచారు. ఈ యూనిట్ లో వెంటిలేటర్లతోపాటు ఇమేజింగ్ పరికరాలు, టెలి-రేడియాలజీ, ఈ-ఐసీయూ, ఆల్ట్రాసౌండ్, ఏఐ ఆధారిత రిస్క్ స్ట్రాటిఫికేషన్, కాంటాక్ట్ లెస్ శాంపిల్ కలెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి.