అమిత్ షాకు కొడుకు పదవీ ఎలా వచ్చింది.. మోడీ కామెంట్లపై హరీశ్, ఎర్రబెల్లి గుస్సా
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో.. టీఆర్ఎస్ పాలనపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ పాలన అనడంతో అగ్గిరాజేసింది. మరీ కేంద్రంలో ఉన్న పెద్దల గురించి మాట్లాడారు. ఒక కుటుంబం లాభం పొందుతుందని సంగతి యావత్ దేశం గమనిస్తోందని మోడీ కామెంట్స్ చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మోడీ చిల్లర మల్లర మాటలు మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు.
మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మోడీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అమిత్ షా తనయుడు ఏమైనా క్రికెట్ ఆటగాడా? ఆయన బీసీసీఐకి ఎలా కార్యదర్శి అయ్యాడు? అని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోడీకి లేదని, తెలంగాణను ఓ కుటుంబంలా భావించి పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని హరీశ్ రావు పేర్కొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. కుటుంబం లేని వ్యక్తి మోడీ అని, ఆయనకు సెంటిమెంట్లు తెలియవని విమర్శించారు. మోడీ చరిత్రపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని కామెంట్ చేశారు. మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడమే మీ పనా? అంటూ మోడీని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో అవమానకరంగా మాట్లాడారని, తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పేర్కొన్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
మోదీ చెబుతున్న కుటుంబ పాలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ది కుటుంబ పాలన కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని ఎర్రబెల్లి ఉద్ఘాటించారు. జైళ్లకు వెళ్లి, త్యాగాలు చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని వివరించారు.