రైతుల డిమాండ్స్ కు కేంద్రం వద్ద సమాధానం లేదని ఫైర్ అయిన మంత్రి హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజులుగా రైతులు ఢిల్లీలోని నిరంకారీ గ్రౌండ్లో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒకసారి రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. అప్పుడు చర్చలు సఫలం కాలేదు. అలాగే తాజాగా మరోమారు నేడు రైతు సంఘం నేతలను చర్చలకు ఆహ్వానించింది.
రాతపూర్వకంగా హామీ ఇస్తే, సమ్మెవిరమిస్తామని చెప్పినా కేంద్రం సైలెంట్
ఇక తాజా పరిణామాలపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఒక వైపు రైతులు రాతపూర్వకంగా హామీ ఇస్తే, సమ్మెవిరమిస్తామని చెబుతున్నా కేంద్రం దగ్గర సమాధానమే లేదని హరీష్ రావు మండిపడ్డారు . కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి, కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ హరీష్ రావు విమర్శించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి 99 వేల ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి కదలి వచ్చి నిరసన తెలియజేస్తున్నారని పేర్కొన్నారు హరీష్ రావు .
రైతుల ఆందోళనలను అణచివేసే యత్నం చేస్తున్న కేంద్రం
రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర సర్కార్, రైతుల ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రయత్నం చేస్తోందంటూ హరీష్ రావు ఆరోపణలు గుప్పించారు.
గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఆందోళనలో ఇప్పటివరకు ఐదుగురు రైతులు మృతి చెందారని, వీరిలో ముగ్గురు ఆందోళనల్లో మృతి చెందగా, మరో ఇద్దరు చలి తీవ్రతకు మృతిచెందారని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావ్ . కేంద్ర ప్రభుత్వం పిలిచి రాతపూర్వకంగా రాసి ఇస్తే రైతుల సమ్మె విరమిస్తామని చెప్పారని, అయితే ఇప్పటివరకు కేంద్రం ఆ పని చేసింది లేదని, కేంద్రం వద్ద సమాధానమే లేదని హరీష్ రావు మండిపడ్డారు.
రైతులకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని హరీష్ మండిపాటు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బిజెపి సర్కార్ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకు వచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తుంటే, కనీసం ఆ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతోంది అని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ సర్కార్ రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడమే కాకుండా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తోందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రైతుల సమస్యలను పరిష్కరించేలా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.