సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబేది? మోడీపై విరుచుకుపడిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ లో ప్రధాని మోడీ ప్రసంగంపై టీఆర్ఎస్ మంత్రులు విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక ప్రశ్నకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పలేదని, అసలు తమకు జవాబుదారీతనమే లేదని మోడీ మరోమారు నిరూపించుకున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రకటన కూడా చెయ్యలేదు : హరీష్ రావు
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దేశానికి, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విధానం ఏదైనా ప్రకటిస్తారని ఆశించామని, కానీ పార్టీకి ఆ విధానమే లేదని మోడీ తేల్చేశారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప ఆ పార్టీకి మరేమీ తెలియదని మండిపడ్డారు. ప్రధాని ప్రసంగం పై స్పందించిన మంత్రి హరీష్ రావు ప్రధాని రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రకటన చేయలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణా గిరిజనులకు మోడీ సర్కార్ అన్యాయం చేసింది
గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని చెబుతున్న కేంద్ర మంత్రులు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సిటీకి అనుమతులు నిధులు ఇవ్వలేదని పేర్కొన్న హరీష్ రావు సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదని ప్రధాని మోడీని నిలదీశారు. తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడం లేదా అంటూ హరీష్ రావు మండిపడ్డారు.
గుజరాత్, యూపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అన్నీ ఇచ్చి తెలంగాణాకు మొండి చెయ్యి
గుజరాత్ కు క్రూడాయిల్ రాయల్టీ 763 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఇక రాజ్ కోట్ కు ఎయిమ్స్, బుల్లెట్ ట్రైన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీ కి జాతీయహోదా ఇవ్వడంతోపాటు, ట్రెడిషనల్ మెడిసిన్ కు గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారని పేర్కొన్నారు. మిషన్ యూపీ కింద రూ. 55,563 కోట్లు, 9 మెడికల్ కాలేజీలు, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రకటించారని హరీష్ రావు తెలిపారు. కర్ణాటకకు తుముకూర్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ముంబై బెంగళూరు మధ్య ఎకనామిక్ కారిడార్, మైసూరు టెక్స్ టైల్ మెగా క్లస్టర్ వంటివి ఇచ్చారని, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండిచేయి చూపించారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మోడీ ప్రసంగం
ఇక ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తాము అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మోడీ ప్రసంగం సాగిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.