తెలంగాణలో మిడిల్ ఫింగర్ గోల.. అదే కోవలో మంత్రి కూడా.. కోపంతో కాదు గానీ..!
హైదరాబాద్ : తెలంగాణ పరిషత్ ఎన్నికల వేళ మిడిల్ ఫింగర్ రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో వింత కామెంట్లకు వేదికైంది. అసలే కుర్రకారు మిడిల్ ఫింగరుకు ఏమేమో అంటగట్టి మీనింగ్ మార్చేస్తున్నారు. అదలావుంటే ఓటేసి మధ్య వేలు చూపిస్తూ ఫోటోలు పోస్టు చేస్తుంటే ఇంకేమైనా ఉంటుందా? మరింత రచ్చవుతోంది. ఇక యువకులంటే ఏమో అనుకోవచ్చు.. ఆకతాయి చేష్టలు, చిలిపి పనులు.. అదంతా సరదాగా చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి తెలిసో తెలియకో ఓటేశాక మిడిల్ ఫింగర్ ను చూపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
చూపుడు వేలు నుంచి మధ్యన వేలు దాకా..!
పరిషత్ ఎన్నికల వేళ ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టాల్సిన సిరాచుక్క.. మధ్యన వేలుకు పెట్టాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. కొందరు యువకులు ఓటు వేశాక ఆ వేలిని చూపిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సాధారణంగా యువకులు ఇతరులను తిట్టే సందర్భంలో ఆ వేలిని చూపిస్తుంటారు. మిడిల్ ఫింగర్ చూపిస్తే చాలు అవతలోడికి సుర్రుమంటుంది. అంతలా అందులో బూతు మీనింగ్ దాగి ఉంది.
దాంతో వారి స్నేహితులు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తుండటం చర్చానీయాంశమైంది. అయితే మధ్యన వేలు చూపించడమనేది బూత్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉండటంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో కాంట్రావర్సీ టాపిక్ అవుతోంది. తమ ఫోటోలకు వచ్చిన కామెంట్లు చూస్తూ కొందరు ఫన్నీగా తీసుకుంటే మరికొందరు సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రిగారు ఆ మాత్రం తెల్వదా..!
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిషత్ ఎన్నికల వేళ తన స్వగ్రామం ఎల్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆయన ఓటు వేసి బయటకొచ్చాక మిడిల్ ఫింగర్ చూపిస్తూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యువకులంటే ఏమో గానీ.. మంత్రి గారికి ఆ మాత్రం తెలియదా అనే కామెంట్లు వస్తున్నాయి. మధ్యన వేలు చరిత్ర తెలిసో తెలియక మంత్రి ఆ పని చేసి ఉంటారులే అని మరికొందరు పేర్కొంటుండటం గమనార్హం.
ఆ మంత్రి ఒక్కరే కాదు.. చాలామంది ప్రతిప్రతినిధులు ఇలా ఫోటోలకు ఫోజులిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, సుంకె రవిశంకర్, మదన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరుల ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వేలు గురించి బాగా తెలిసినవారు మాత్రం జాగ్రత్తపడ్డారు. ఒక వేలు మాత్రమే చూపించకుండా.. మొత్తం చేయి చూపించడం విశేషం.
వరుస ఎన్నికలతో ఈ గోల
తెలంగాణలో ఒక రకంగా ఓట్ల సీజన్ నడుస్తోంది. గత డిసెంబరులో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి పరిషత్ ఎన్నికల వరకు వరుసగా ఓట్ల పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరిగితే.. మళ్లీ వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఆ క్రమంలో ఆ రెండింటి మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఓటర్ల ఎడమచేతి చూపుడువేలుకు పెట్టే సిరాచుక్కను మిడిల్ ఫింగర్కు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ గోల ఏందిరా నాయనా..!
ఎన్నికల సమయంలో ఓటర్ల ఎడమచేతి చూపుడువేలుకు సిరాచుక్క పెట్టడం ఆనవాయితీ. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానం ఇది. అయితే ఆ సిరాచుక్క అంతా ఈజీగా చెరిగిపోదు. అదలావుంటే పార్లమెంటరీ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా దాటలేదు. లోక్ సభ ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల చేతి వేళ్లకు ఇంకా సిరాచుక్క అలాగే ఉండిపోయింది. దాని వెంబడే పరిషత్ ఎన్నికలు రావడంతో మధ్యన వేలుకు సిరాచుక్క వేయాలని ఈసీ డిసైడ్ చేసింది.
అయితే ఈ మిడిల్ ఫింగర్ గోలతో మరో వాదన వినిపిస్తోంది. ఎన్నికల సంఘానికి వేరే వేలు దొరకనట్లు.. అదే వేలు సెలెక్ట్ చేయడమేంటిరా బాబూ అనే కామెంట్లు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. మొత్తానికి పరిషత్ ఎన్నికలేమో గానీ.. ఈ బూతు వేలు, సారీ సారీ.. ఈ మిడిల్ వేలు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు.