అవి కూడా ఆన్లైన్ లోనే.. సూర్యాపేట అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..
సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్లైన్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. మాంసం విక్రయాలను కూడా ఆన్లైన్ ద్వారానే జరపాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని తాజా పరిస్థితులపై ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితర అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని అధికారులకు సూచించారు. మటన్, చికెన్ సహా అన్ని విక్రయాలను ఆన్లైన్ ద్వారా జరపాలని ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి పాలు, కూరగాయలు వార్డుల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్లో మెడిసిన్ కొనుగోళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫార్మాసిస్టులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.
Recommended Video
సూర్యాపేట శివారు,పరిసర ప్రాంతాల ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందిపడుతున్నారని.. ఆ సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. పట్టణ శివార్లలో ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో హోల్ సేల్ దుకాణాలను ఏర్పాటు చేసి.. వారి అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో పట్టణం నుంచి ఎలాంటి రాకపోకలు ఉండవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో.. ముస్లిం సోదరులకు పండ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.