ఆ మహానాయకులపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు గర్హనీయం.. ఎంఐఎం ఎమ్మెల్యేకు కేటీఆర్ కౌంటర్...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ నర్సింహారావు,ఎన్టీఆర్ ఘాట్లను టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా... తాజాగా మంత్రి కేటీఆర్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఆ వ్యాఖ్యలు గర్హనీయం : కేటీఆర్
'మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నర్సింహారావు,ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.ఈ ఇరువురు తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు.' అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అక్బరుద్దీన్ ఏమన్నారు...
అంతకుముందు,రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బల్కంపేట రోడ్ షోలో మాట్లాడుతూ... పీవీ నర్సింహారావు,ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేసే దమ్ము ఎంఐఎంకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే రెండు గంటల్లో తాము దారుసలాంను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. అక్రమ కట్టడాలు,పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు 4700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.
వ్యూహాత్మకమేనా..?
టీఆర్ఎస్ పార్టీపై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదన్నారు. అంతేకాదు,అసెంబ్లీలో టీఆర్ఎస్ తోకను తొక్కి ఎలా ఆడించాలో తమకు తెలుసన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం మిత్రపక్షాలని... టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్లేనని బీజేపీ ప్రచారం సాగిస్తున్న వేళ.. ఆ రెండు పార్టీల మధ్యే మాటల యుద్దం జరుగుతుండటం గమనార్హం. ఇదంతా టీఆర్ఎస్ వ్యూహంలో భాగమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.