మంత్రి కేటీఆర్కు వరల్డ్ ఎకనమిక్ ఫోరం లేఖ... ఆ అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం...
జపాన్లోని టోక్యోలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరగనున్న 'ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్-2021' సదస్సుకు హాజరుకావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే కేటీఆర్కు లేఖ రాశారు. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు.
'ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం'పై సదస్సు...
కోవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి తిరిగి వృద్ధి బాట పట్టేందుకు 'ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం' అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఈ నూతన టెక్నాలజీల వినియోగం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల బలోపేతంతో పాటు అందులో ఎదురయ్యే సవాళ్లు,వాటి పరిష్కార మార్గాలపై సదస్సులో చర్చించనున్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో కేటీఆర్ నాయకత్వం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాసిన లేఖలో ఆయనపై ప్రశంసలు కురిపించింది.
ఆ బంధం మరింత బలోపేతం దిశగా...
ఎఐ4ఏఐ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, జీ-20 స్మార్ట్ సిటీస్ అలయన్స్ వంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టిన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చినందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బోర్గ్ బ్రండే ఆ లేఖలో పేర్కొన్నారు. టోక్యోలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరవడం ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ వేదికపై ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో మరిన్ని అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
గతంలోనూ హాజరైన కేటీఆర్...
గతేడాది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫోరం నిర్వహించిన సుమారు 50కి పైగా సమావేశాలు,5 చర్చా కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్,అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్,కోకాకోలా సీఈవో జేమ్స్ క్వేన్సీ,యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కి తదితర కార్పోరేట్ దిగ్గజాలతో కేటీఆర్ సమావేశమై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను,పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాలను,అనుకూల పరిస్థితులను ఈ సందర్భంగా కేటీఆర్ వారికి వివరించారు.