పాము-ముంగీస కలిశాయి.. ఢిల్లీపార్టీలవి సిల్లీ పనులు.. ఎక్స్ అఫీషియో తెచ్చిందెవరు? మంత్రి కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన పట్టణ ప్రజలకు పార్టీ తరఫున థ్యాంక్స్ చెబుతున్నానని, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేసి చూపించి రుణం తీర్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లకు మేయర్, మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇది చరిత్రాత్మక విజయం..
రాష్ట్రంలోని 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారనడానికి ఇది నిదర్శనమని, దేశంలో ఏ పార్టీ కూడా వరుస ఎన్నికల్లో ఇంతటి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నదాఖలాలు లేవని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు కేవలం 8 స్థానాలే దక్కాయని, అందులో కాంగ్రెస్కు 4, బీజేపీ 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చాయని చెప్పారు.
వాటిలోనూ మాదే గెలుపు..
సోమవారం నాటికి 125 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగ్గా, 119 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు పదవులు దక్కాయన్న మంత్రి కేటీఆర్.. ఎన్నికలు వాయిదాపడ్డ మేడ్చల్, నేరేడుచర్లలోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ఫలితాల్లోనూ టీఆర్ఎస్ హవా సాగుతోందని, ఎన్నికలు జరిగిన పదికి పది కార్పొరేషన్లు గెలవడం చరిత్రాత్మక విజయమన్నారు.
ఢిల్లీ పార్టీలు.. సిల్లీ పనులు..
జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో భీకరంగా పోరాడుతూ.. తెలంగాణలో మాత్రం చాలా సిల్లీగా కుమ్మక్కైపోయానని కేటీఆర్ విమర్శించారు. ‘‘టీఆర్ఎస్ దెబ్బకి.. పాము-ముంగిసలాంటి బీజేపీ-కాంగ్రెస్ కలిసిపోయాయి. మక్తల్ లో బీజేపీ చైర్మన్ అయితే, కాంగ్రెస్ వైస్ చైర్మన్. మణికొండలో కాంగ్రెస్ చైర్మన్ కాగా, బీజేపీకి వైస్ చైర్మన్ దక్కించుకున్నారు. జాతీయ పార్టీలు అయిఉండి.. మున్సిపాలిటీల ఇంతగా దిగజారాలా? పైపెచ్చు వీళ్లు మమ్మల్ని ఏజెంట్లని విమర్శించడం ఎంతవరకు సమంజసం? ''అని ప్రశ్నించారు.
చట్టాన్ని వాడుకుంటే తప్పేంటి?
ఎక్స్ అఫీషియో మెంబర్స్ ద్వారా చాలా చోట్ల అక్రమంగా పదవులు చేపట్టారన్న విమర్శలను కేటీఆర్ ఖండించారు. ఆ చట్టాన్ని 1999లో టీడీపీ తెచ్చిందని, 2008లో ఎమ్మెల్సీలకు కూడా అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ సవరణలు చేసిందని, ఉన్న చట్టాన్ని వాడుకోవడంలో తప్పేమీలేదని మంత్రి అన్నారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థికి సహకరించిన ఎంఐఎం పార్టీకి ధన్యవాదాలు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి ఎవరినైనా సహించబోమని, కొల్లాపూర్ లో రెబల్స్ ను తిరస్కరించడం అందుకో ఉదాహరణ అని కేటీఆర్ చెప్పారు.