రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తోంది: కేటీఆర్ నిప్పులు
గ్రేటర్ ప్రచారం ఊపు మీదుంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య వార్ పీక్ కి చేరుకుంది. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అంటున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అదే నిజమైతే ఆరేళ్లుగా ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. రోహింగ్యాలు ఆధార్, ఓటర్ కార్డులు తీసుకుంటుంటే హోం, రక్షణ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని అడిగారు.
గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించేందుకు బీజేపీ ఇలా మాట్లాడటం హైదరాబాద్కే కాదు.. దేశానికీ మంచిది కాదన్నారు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి టూరిస్టులు వస్తున్నారని బీజేపీ ప్రచార పర్వాన్ని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క టీఆర్ఎ్సను ఎదుర్కొనేందుకు 12 మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా వస్తారట అని చెప్పారు. ఇక్కడా వ్యాక్సిన్ ఉచితమని ఆయన చెబుతారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నాడని డొనాల్డ్ ట్రంప్ను కూడా తీసుకొస్తారేమో అని ఎద్దేవా చేశారు.
పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజలు రూ.2.72 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం రూ.1.40 లక్షలు తిరిగి ఇచ్చారనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఎవరొచ్చినా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పి వెళ్లాలని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామిగా ఉన్నందుకు భారతీయులుగా గర్వపడుతున్నామన్నారు. అయితే కేంద్రమే తెలంగాణకు డబ్బులు ఇచ్చిందనే ఫొజులు కొట్టొద్దని, ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.
కేంద్రం నుంచి హైదరాబాద్కు వచ్చే పెద్దలు వరద సాయంగా రూ.1350 కోట్లు తేవాలన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో జన్ధన్ ఖాతాలు తెరవాలని మోదీ చెప్పారని, ఆయన పంపిన రూ.15లక్షఽలు ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. బల్దియాలో మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.