అవమానించిందే గాక మాట్లాడుతారా..? భట్టిపై కేటీఆర్ ఫైర్, హైదరాబాద్ డెవలప్..
కాంగ్రెస్ నేతలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అంబేద్కర్పై తమకు గౌరవం లేదనే కామెంట్లను తోసిపుచ్చారు. గ్రేటర్ హైదరాబాద్, పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అంబేద్కర్పై గౌరవం లేదని భట్టి విక్రమార్క చెబుతున్నారు.. కానీ అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు.
1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ నేతలు.. ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వద్ద 28 ఫీట్ల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ట్యాంక్బండ్ వద్ద 125 ఫీట్ల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టబోతున్నామని తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కితే.. తమ పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రతినెల జీహెచ్ఎంసీకి రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో గల బస్తీ దవాఖానాలను 350కి పెంచుతామన్నారు. త్వరలో జవహర్నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నెలకొల్పుతామని చెప్పారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించినప్పటీ నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కోసం రూ.67 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని తెలిపారు. నూతన మున్సిపల్ చట్టం ద్వారా అనుమతుల్ని మరింత సులభతరం చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో మౌలికసదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం గోల్కొండ, చార్మినార్ మేమే నిర్మించామని చెప్పిన చెబుతారని అన్నారు.