జగదీష్ గారూ జాగ్రత్తగా ఉండండి.. సహచర మంత్రికి కేటీఆర్ సూచన.. రెండు గంటపాటు నిమ్స్లోనే..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. సీఎం స్థాయి సెక్యూరిటీ నడుమ బుధవారం మధ్యాహ్నం నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. జర్వంతో అస్వస్థతకు గురై, చికిత్స పొందుతున్నవిద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని పరామర్శించారు. రెండు గంటలపాటు ఆయన ఆస్పత్రిలోనే గడిపారు.
ప్లీజ్ టేక్ కేర్..
మంత్రి హెల్త్ కండిషన్ గురించి కేటీఆర్ డాక్టర్లను అడిగితెల్సుకున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని జగదీష్ రెడ్డికి సూచించారు. కేటీఆర్ వెంట వచ్చిన ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరు కూడా జగదీష్ రెడ్డిని పరామర్శించారు. కేటీఆర్ రాక సందర్భంగా నిమ్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును పటిష్టం చేశారు.
నిమ్స్ కు నేతల తాకిడి..
సీఎం కేసీఆర్ కు దగ్గరి వ్యక్తిగా పేరున్న మంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించేందుకు నేతలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో నిమ్స్ వద్ద హడావుడి నెలకొంది. బుధవారంమంత్రిని పరామర్శించిన వారిలో టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంగా చక్రపాణి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహా రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాధం తదితరులున్నారు.
సొంత జిల్లాలో మంత్రి కోసం పూజలు
జ్వరంతో బాధపడుతున్న మంత్రి జగదీష్ రెడ్డి అతిత్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన సొంత జిల్లా సూర్యాపేటలో టీఆర్ఎస్ నాయకులు పూజలు నిర్వహించారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాల్లో వివిధ దేవాలయాల వద్ద అభిమానులు మంత్రి పేరుతో అర్చనలు చేయించారు.