బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ.. పరిస్థితి చేయి దాటితే ఉక్కుపాదమే... సొంత నేతలైనా.. : కేటీఆర్ వార్నింగ్
గడిచిన ఆరున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజల్లో విద్వేషాలను నింపి... ఆ కారణంగా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎవరైనా సరే... పరిస్థితి చేయి దాటేలా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని... ఆఖరికి సొంత పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలను కేటీఆర్ తప్పు పట్టారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు.
పాతబస్తీలో హిందువులు లేరా...
పాతబస్తీలో కేవలం ముస్లింలే ఉన్నారా... హిందువులు లేరా అని కేటీఆర్ బీజేపీని ప్రశ్నించారు. పాతబస్తీలోని ఒక వర్గంపై అంత ద్వేషం ఎందుకని నిలదీశారు. అభివృద్ది గురించి మాట్లాడలేక... ఏం చేశారో చెప్పలేక కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీజేపీని నమ్మేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్దంగా లేరని పేర్కొన్నారు.
ఎంఐఎంతో పొత్తు లేదు..
మజ్లిస్ పార్టీతో తమకెలాంటి పొత్తు లేదని... అయితే అంశాలవారీగా ఆ పార్టీ తమకు మద్దతునిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి తాము కూడా అంశాలవారీగా మద్దతునిచ్చామని గుర్తుచేశారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో కొన్ని స్థానాల్లో ఎంఐఎంను టీఆర్ఎస్ ఓడించిందని గుర్తుచేశారు. అక్బర్ బాగ్,లంగర్ హౌస్,మలక్పేట్ తదితర ప్రాంతాల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. మరో పార్టీ అవసరం లేకుండానే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందన్నారు. ఎక్స్అఫీషియో ఓట్ల అవసరం కూడా తమకు రాదన్నారు.
బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ...
బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతోందని.. ఉద్వేగాలు రెచ్చగొట్టేవారి చేతిలో హైదరాబాద్ను పెడితే పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి తయారవుతుందని కేటీఆర్ అన్నారు. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లు చెప్పే ఎజెండాతో ఆ పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది మోదీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉందని అమ్మేస్తున్నారని... మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్మేస్తున్నారని నిలదీశారు. మోదీ సర్కార్ 'బేచో ఇండియా(అమ్మకానికి భారత్)' స్కీమ్ నడుపుతోందని... తమలాంటివాళ్లం సోచో ఇండియా(ఆలోచించు భారత్) అని నినదిస్తున్నామన్నారు.
Recommended Video
మతం అన్నం పెట్టదు...
మతం అన్నం పెట్టదని... మతం ఉద్యోగాలు ఇవ్వదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మతం కాదు జనహితం మా అభిమతమన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజల మూడ్కు ప్రతిబింబం లాంటివేనని.. అయితే
గ్రేటర్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థుల అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయని అన్నారు. గ్రేటర్లో అధికారంలోకి వస్తే అభివృద్ది పథంలో ముందుకెళ్తామని... పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని 2016లో హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. చెప్పినట్లుగానే ఆ దిశగా పనిచేసి చూపించామన్నారు. విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించామన్నారు. రూ.2వేల కోట్లతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 90శాతం నీటి సమస్యను పరిష్కరించామన్నారు. పశ్చిమాన మాత్రమే కేంద్రీకృతమై ఉన్న ఐటీ రంగాన్ని ఉప్పల్,కొంపల్లి ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు.