వైరస్ కట్టడిలో మనమే ఫస్ట్.. టీకాపై అనుమానం వద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కరోనా వ్యాక్సిన్ పై జనానికి అనుమానాలు అవసరం లేదని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. టీకాకు సంబంధించిన ప్రతీ అంశంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందుందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 వాక్సినేషన్లో భాగంగా శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించారు.
కరోనాకు చరమగీతం పాడేలా వాక్సిన్ దోహధపడుతుందని సబితా ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నామని.. తొలి దశలో 3.15 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాలు వేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్ మాత్రమే అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కరోనా కాలంలో ధైర్యంగా ఉండి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఫ్రంట్ లైన్ వారియర్స్కు మొదటి ప్రాధాన్యతగా టీకాలు వేస్తామన్నారు. ఫస్ట్ డోసు వేసుకున్న వారు 20 రోజుల తరువాత రెండో డోసు వేయటం జరుగుతుందని చెప్పారు. వాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగిందని, సెంటర్ల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైద్యులు అందుబాటులో ఉంటారని మంత్రి అన్నారు.
వికారాబాద్ జిల్లాలో మూడు సెంటర్లలో 90 మందికి వ్యాక్సిన్ వేశారని తెలిపారు. 18వ తేదీ నుంచి 28 సెంటర్లలో 5395 మందికి మొదటి విడత వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలి అని ప్రార్థిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంట జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, పరిగి, చేవెళ్ళ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా వైద్యాధికారి తదితరులు ఉన్నారు