తొలి బొనం సమర్పించిన తలసాని.. రంగానికి ఏర్పాట్లు
లష్కర్ ఆషాఢ బోనాల జాతరతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సోమవారం రంగం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
సీమలో కూడా..
బోనాలు హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తల పై పెట్టుకుని, డప్పు చప్పుళ్లుతో వచ్చి అమ్మవారి ఆలయానికి వెళ్తారు.
కద్దు..
మహిళలు తీసుకెళ్ళే బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడితో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచుతారు.. దానినే కద్దు అంటారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ తదితర పేర్లు కల దేవి ఆలయాలను అందంగా అలంకరిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.
పుట్టింటికీ దేవి..
ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని విశ్వసిస్తారు. దేవిని దర్శించుకుని, కూతురు ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
దున్నపోతు నుంచి కోడి వరకు
పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. కాలక్రమంలో దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తారు. బోనాలను తీసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం ఉంది. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు చల్లుతారు.
Recommended Video
తొట్టే
భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందం ఒక తొట్టెలను సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది