మైనార్టీల ఓట్లు ఎవరికో?.. నేతల గాలం.. హమీల పర్వం
హైదరాబాద్ : మరోసారి ఓట్ల పండుగ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు నేతలు. ఇక తెలంగాణలో అత్యధికంగా ఉన్న మైనార్టీలపైకి లీడర్ల చూపు మళ్లింది. మసీదులు, చర్చిల చుట్టూ తిరుగుతూ ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇంతకు రాష్ట్రంలో మైనార్టీల ఓట్లెన్ని? ఈసారి ఎన్నికల్లో వారు ఎవరికి పట్టం కట్టనున్నారనే విషయాలు చర్చానీయాంశంగా మారాయి.
మైనార్టీ ఓట్లు.. నేతల పాట్లు
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా చూసినట్లయితే రెండు మూడు రాష్ట్రాల తర్వాత అత్యధికంగా మైనార్టీలు ఉన్నది తెలంగాణలోనే. అందుకే ఈసారి లోక్సభ బరిలో వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం రాష్ట్రంలో 3.63 కోట్ల జనాభా లెక్క తేలింది. అందులో 11.22 లక్షల కుటుంబాలతో అత్యధికంగా 52.53 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి తర్వాత 1.29 లక్షల క్రిస్టియన్ కుటుంబాలున్నాయి. సిక్కులు, జైనులు, బౌద్ధులు.. ఆ తర్వాత వరుస క్రమంలో ఉన్నారు.
మైనార్టీలు అత్యధికంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నివసిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు. అయితే దాదాపు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో మైనార్టీల ప్రభావం కనిపించనుంది. పలు లోక్సభ సెగ్మెంట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయి కనిపిస్తోంది.
కోమటిరెడ్డి సోదరులే నన్ను ఓడించారు..! కాంగ్రెస్ కు భిక్షమయ్య గౌడ్ గుడ్ బై
ఎవరికో ఈసారి..!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ముస్లింలదే పైచేయి. అందుకే అత్యధిక ఓటర్లు నమోదయి ఉన్న భాగ్యనగరం.. ఎంఐఎంకు కంచుకోటలా మారింది. సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానంలోనూ మైనార్టీ ఓటర్లదే హవా. 2014 లోక్సభ సెగ్మెంట్ కు జరిగిన ఎన్నికల్లో ఎంఐఎంకు 14 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ మైనార్టీల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం కేవలం హైదరాబాద్ సెగ్మెంట్ లోనే పోటీకి దిగింది. దీంతో సికింద్రాబాద్ లో మైనార్టీల ఓటు బ్యాంకు ఏ పార్టీకి కలిసొస్తుందనేది చర్చానీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాల్లో గెలుస్తామని మొదటినుంచి చెబుతోంది టీఆర్ఎస్. ఇంకో స్థానమైన హైదరాబాద్ ను ఎంఐఎంకు వదిలేసింది. ఇక్కడి నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఒక్క చోట తప్ప మిగిలిన 16 స్థానాల్లో టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించారు అసదుద్దీన్.
అయితే ఎంఐఎం పిలుపుకు ముస్లింలంతా కట్టుబడి ఉంటారా? అనేది ఒక పాయింట్. ఒకవేళ అదే జరిగితే కారు గుర్తుకు గంపగుత్తగా ఓట్లు పడతాయనడంలో అనుమానం లేదు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముస్లింలకు అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. షాదీ ముబారక్, ప్రత్యేక గురుకులాలు, రంజాన్ కు ఇఫ్తార్ విందు, పేదలకు బట్టలు, ఇమాములకు పెంచిన వేతనాలు తదితర అంశాలు కారు గుర్తుకు కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు.
బీజేపీ ఆశ ఫలించేనా?
క్రిస్మస్ సందర్భగా క్రిస్టియన్ కుటుంబాలకు కూడా బట్టలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో క్రిస్టియన్ ఓటర్లు కూడా తమకు సానుకూలంగా ఉంటారనేది గులాబీ నేతల అంతరంగం. అయితే గత ఎన్నికల హామీ మేరకు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయించలేకపోవడం, క్రిస్టియన్ భవన నిర్మాణం ఇంకా చేపట్టకపోవడం తదితర అంశాలు టీఆర్ఎస్ కు మైనస్ గా మారే అవకాశముంది.
అదలావుంటే ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రార్థనమందిరాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. ముఖ్యంగా మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మైనార్టీలకు ఇప్పటివరకు ఏం చేశాం, ఏం చేయబోతామనే అంశాలు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. మసీదులకు, చర్చిలకు నిధులిస్తామని, షాదీఖానాలు కట్టిస్తామని హామీల వర్షం గుప్పిస్తున్నారు. అటు బీజేపీ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. త్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావడంతో మైనార్టీ మహిళల ఓట్లు తమకే పడతాయని భావిస్తోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు ఎవరికి లాభిస్తాయో చూడాలి.