మైనర్ల ర్యాష్ డ్రైవింగ్.. సరదా కోసం మందు తాగి.. అమ్మమ్మ, మనవడు బలి..!
హైదరాబాద్ : మైనర్ల సరదా ఓ కుటుంబంలో విషాదం నింపింది. వచ్చీ రాని డ్రైవింగ్తో కారులో షికార్లు కొట్టిన మైనర్లు.. ఇద్దర్ని పొట్టనపెట్టుకున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. బంధువుల ఇంటికి వెళదామని ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులకు మైనర్ల రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. అతివేగంగా కారు నడుపుతూ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొని 14 నెలల బాలుడితో పాటు 65 సంవత్సరాల మహిళ ప్రాణాలు బలిగొన్నారు.
బోయిన్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. మైనర్లే కారణం..!
హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 14 నెలల బాలుడితో పాటు అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీకి చెందిన చిలుకూరు చంద్రశేఖర్, సంధ్యా కిరణ్ భార్యభర్తలు కాగా అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వారికి మహదేవ్, మాధవ్ అనే కవల పిల్లలున్నారు. అయితే సంధ్యాకిరణ్ తల్లి నాగమణి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
ఆ క్రమంలో ఆదివారం నాడు యాప్రాల్లో నివసించే నాగమణి మేనల్లుడి ఇంటికి వెళ్లేందుకు వారంతా సిద్ధమయ్యారు. దాంతో ఓలా ఆటో బుక్ చేసుకుని బయలుదేరారు. అయితే బోయిన్పల్లి డెయిరీ ఫామ్ క్రాస్రోడ్డులోని కంటోన్మెంట్ చెక్పోస్ట్ దగ్గర ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు వీరి ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
సరదా కోసం కారు నడిపిన మైనర్లు.. అమ్మమ్మ, మనవడు దుర్మరణం
నలుగురు మైనర్లు సరదా కోసం కారు నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంగా కారు నడుపుతూ సంధ్యాకిరణ్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఓలా ఆటోను ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని అంబులెన్స్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే సంధ్యాకిరణ్ కుమారుడు మాధవ్ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె తల్లి నాగమణి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. సంధ్యాకిరణ్, మరో అబ్బాయి మహదేవ్తో పాటు ఓ ద్విచక్ర వాహనదారుడికి ప్రాణాపాయం తప్పింది.
ఈ ప్రమాదానికి నలుగురు మైనర్లు కారణంగా పోలీసులు గుర్తించారు. అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాహనం నడిపిన మరో బాలుడు మాత్రం పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ముగ్గురు అరెస్ట్.. అసలు నిందితుడి కోసం గాలింపు
కారులో ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి కారణమైన నలుగురి నిందితులపై కేసు నమోదు చేశారు. రాష్ డ్రైవింగ్ చేయడమే గాకుండా ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. అదలావుంటే 14 నెలల బాలుడు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
కారులో ప్రయాణిస్తున్న మైనర్లు మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. సరదా కోసమంటూ కారు నడుపుతూ ఇలా ఇద్దరి ప్రాణాలు బలిగొన్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే కారు నడిపిన హసన్ అనే మైనర్ బాలుడు పరారీలో ఉండటంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అదలావుంటే ఈ ప్రమాదంలో 14 నెలల బాలుడితో పాటు అమ్మమ్మ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.