కీచక కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు.. ఏసీపీ సంగతేంటంటున్న విద్యార్థులు
హైదరాబాద్ : చార్మినార్ యూనాని ఆస్పత్రి వద్ద ధర్నా చేపట్టిన వైద్య విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేశ్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతనిని విధుల నుంచి సస్పెండ్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఘటనపై దర్యాప్తు చేయాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు. విచారణ ఆధారంగా కానిస్టేబుల్పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టంచేశారు. అయితే కానిస్టేబుల్ ఓకే .. ఏసీపీ ఆనంద్పై చర్యల సంగతి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ విషయం ..
చార్మినార్ వద్ద గల యునాని ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిని నిరసిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనకు దిగారు. బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వారిని అదుపులోకి తీసుకునే చర్యల్లో భాగంగా ఖాకీలు కీచకంగా ప్రవర్తించారు. విద్యార్థినులపై కానిస్టేబుల్ పరమేశ్, ఏసీపీ ఆనంద్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ విద్యార్థిని కానిస్టేబుల్ పరమేశ్ తొక్కగా .. ఆమె అరిచింది. అంతటితో ఆగకుండా గిల్లీ పైశాచిక ఆనందం పొందాడు. దీనిని ఓ విద్యార్థి వీడియో తీసి షేర్ చేయడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసు బాసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనకు సంబంధించి పరమేశ్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని డీసీపీ అంబర్ కిశోర్ ఝాను ఆదేశించారు.
కానిస్టేబుల్ ఓకే .. మరి ఏసీపీ
కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అతనిపై శాఖపరంగా చర్యలు తీసుకోని .. పూర్తిగా విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో మరే విద్యార్థినితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించాలంటే భయపడాలన్నారు. దీంతోపాటు ఏసీపీ ఆనంద్పై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఏసీపీ కూడా విద్యార్థినిని తాకరాని చోట తాకిన సంగతి తెలసిందే. మరోవైపు ఆయుష్ కమిషనర్ వీపుపై చేయి వేసి తీసుకెళ్లాడు. దీనిపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ ఓకే .. ఏసీపీ సంగతేంటని నిలదీస్తున్నారు. అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే తాము ఆయుష్ కోసం కాకుండా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
చర్యలేవీ ?
విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్, ఏసీపీని కాపాడుతుంది ఎవరు అని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. వారి వెనక ఉన్నది ఎవరు ప్రశ్నించాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. తొలుత కానిస్టేబుల్ పరమేశ్పై సస్పెన్షన్ వేటు వేశారు. విచారణ తర్వాత ఏసీపీ ఆనంద్ పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులు మాత్రం ఏసీపీపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమని తేల్చిచెప్పారు. తమ ఆందోళన కొనసాగుతుందని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.