బీజేపీ అభ్యర్థిపై ఎమ్మెల్యే దాడి.. 200 మందితో వచ్చి అటాక్, ఎస్సైని కూడా వదలని వైనం..
గ్రేటర్లో ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. డబ్బులు పంచుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డబ్బులు పంచే విషయం అడ్డుకునే క్రమంలో గొడవ జరిగింది. బీజీపీ అభ్యర్థిపై సాక్షాత్ ఎమ్మెల్యే దాడి చేయడం చర్చానీయాంశమైంది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో ఘటన జరిగింది. టీఆర్ఎస్- బీజేపీ శ్రేణులు గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాజేంద్రనగర్ పరిధి మైలార్ దేవ్ పల్లి డివిజన్లో బీజేపీ నుంచి తోకల శ్రీనివాస్రెడ్డి పోటీ చేస్తున్నారు. డివిజన్ పరిధిలో గల హౌజింగ్బోర్డు, పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని శ్రీనివాస్కు తెలిసింది. అక్కడికి వెళ్లి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు సమాచారం ఇచ్చారు. 200 మందితో కలిసి ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వస్తూనే బీజేపీ అభ్యర్థి, కార్యకర్తలపై దాడి చేశారు. తనకు, కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు గాయాలయ్యాయని శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని.. పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అక్కడికి వచ్చిన ఎస్సై మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు. న్యాయం చేయాలని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న డీకే అరుణ అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు దాడులకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగాలంటే ఎమ్మెల్యే, అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, అనుచరులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై డీసీపీ కార్యాలయంలో కంప్లైంట్ చేశామని బీజేపీ నేత స్వామిగౌడ్ తెలిపారు.