అచ్చా "డిజిటల్ ఇండియా" ను ఇలా అర్థం చేసుకున్నారా..! ఈసీకి దొరక్కుండా చెల్లింపులా?
"రూల్స్" కు ముందే "బ్రేక్స్" తయారవుతున్నాయి. ఏదైనా కొత్తది వస్తుందంటే చాలు.. అదీ రాకముందే లొసుగులను కనిపెట్టే మహానుభావులున్న డిజిటల్ కాలం ఇది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న తంతు చూస్తుంటే ఎవరైనా విస్తుపోవడం ఖాయం. ఎన్నికల సంఘం విధించిన నియమ నిబంధనలకు దొరక్కుండా తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు. "డిజిటల్ ఇండియా" అంటూ ప్రధాని మోడీ జపిస్తున్న మంత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.
ఎన్నికలంటే ఆషామాషీ కాదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో ప్రతి పైసాకు లెక్క చూపించాల్సి ఉంటుంది. ఇక్కడే బరిలో నిలిచిన అభ్యర్థులు "ట్రాక్" మార్చుతున్నారు. లెక్కల చిట్టాపద్దులు ఈసీకి దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. డిజిటల్ ఇండియా ప్రభావంతో పండుగ చేసుకుంటున్నారు.
ఈసీ కన్నుగప్పి.. అంతా క్యాష్ లెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కొందరు అభ్యర్థులు టెక్నాలజీ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ఎన్నికల సంఘానికి దొరకనంతగా వినియోగిస్తున్నారు. ఖర్చుల లెక్కలు ఈసీకి చూపించాల్సిన నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించారు. రోజువారీ ఖర్చులకు, భోజనాలకు, వాహనాలకు ఇలా ప్రతి విషయంలో నో క్యాష్ అంటున్నారు. వ్యాలెట్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చివరకు తమ వెంట తిరిగే జనాలకు ఇచ్చే డైలీ పేమెంట్స్ కూడా డిజిటల్ చెల్లింపులే కావడం గమనార్హం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో ఎమ్మెల్యే అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
అర్ధరాత్రి పేమెంట్లు అందుకేనా?
ఎన్నికల వేళ బహిరంగ సభలు, సమావేశాలపై ఎన్నికల సంఘం నిఘా పెడుతుంది. ఒకవేళ ఈ ఖర్చులు అభ్యర్థులు చూపించని పక్షంలో తాము తీయించిన వీడియో ఆధారాలతో వారి ఖాతాలకు యాడ్ చేస్తుంది. అయితే రోజువారీ ఖర్చులు, పేమెంట్ల విషయంలో ఈసీ నిఘా పనిచేయని పరిస్థితి. దీన్నే అస్త్రంగా వాడుకుని డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతున్నారు. ఎవరికి ఎంత మొత్తం చెల్లించాలి అనే విషయాలు నోట్ చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారని సమాచారం. పొద్దంతా ప్రచార హడావుడి ఉంటుండటంతో అందరూ వెళ్లిపోయాక మిడ్ నైట్ పేమెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నమ్మకస్తుల చేతికి డిజిటల్ క్యాష్..!
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులతో పాటు వారి అనుచరులు బిజీగా ఉంటుండటంతో నమ్మకస్తుల చేతికి "డిజిటల్ క్యాష్" పగ్గాలు అప్పజెప్పుతున్నారని టాక్. దీనికోసం ఏరికోరి కొంతమందిని నియమించుకుంటున్నారట. వ్యాలెట్ల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం.. ఎవరికి ఎంతెంత ఇచ్చిందనే విషయం రికార్డుల రూపంలో చూపిస్తూ పని కానిచ్చేస్తున్నట్లు సమాచారం. దీంతో డబ్బులు ఇచ్చారో, మధ్యవర్తులే మింగారో లాంటి అనుమానాలకు తావులేకుండా పోయింది. గతంలో నగదు రూపంలో పేమెంట్లు చేసినప్పుడు కొన్ని ఆరోపణలు విన్పించేవి. మధ్యవర్తులు తమకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా కొంత నొక్కేశారనే వివాదాలు వచ్చేవి. అయితే ఇప్పుడు డిజిటల్ పేమెంట్లతో అలాంటి గొడవలు ఏమి లేనట్లు తెలుస్తోంది.