భళా మల్లన్నా భళా: "భూకబ్జాలు చేసేది మన నేతలే " అని నిజం చెప్పిన మల్లారెడ్డిపై ప్రశంసలు
Recommended Video
ఆయన తెలంగాణలో మంచి నాయకుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొనాల్సిందే. అంతకు మించి ఆయన బడాపారిశ్రామికవేత్త. ఒకసారి ఎంపీగా గెలిచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రజలు సహాయం కోరి ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కచ్చితంగా సహాయం చేసే మనస్తత్వం ఆయనది.. అందుకే ఎంపీగా ఉన్న అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు గెలిపించి అక్కున చేర్చుకున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు.. ఆయన ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచారు తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరి.
ఎప్పుడూ వార్తల్లో నిలిచే మల్లారెడ్డి
మల్లారెడ్డి... మేడ్చల్ ఎమ్మెల్యే అంతకుముందు మల్కాజ్గిరి ఎంపీగా కూడా పనిచేశారు. మల్లారెడ్డి అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా క్రేజ్. ఎవరైనా పనిపై వెళ్లి మల్లన్నా అంటే చాలు... వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంతేకాదు ఆయన విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థులు కూడా మల్లారెడ్డి అంటే చాలా ఇష్టపడతారు. ఫలానా రోజు మల్లారెడ్డి కాలేజీకి వస్తున్నారని తెలిస్తే ఏ విద్యార్థి ఆరోజు కాలేజీ డుమ్మా కొడదామనే ఆలోచన ఉండదు. ఎందుకంటే అంతలా పిల్లలను బాగా ఎంటర్టెయిన్ చేస్తారు. మల్లారెడ్డి లాంటి ఛైర్మెన్లను చాలా తక్కువగా చూస్తాం.
నేతలే భూకబ్జాలకు పాల్పడుతున్నారు
ఇక అసలు విషయానికొస్తే... జనవరి 28న మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్ నివాసులు ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సరైన విద్యుత్ సదుపాయం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, సరైన అనుమతులు లేకుండా అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేస్తుండగా వీడియో కూడా రికార్డ్ చేశారు. దీనికి మల్లారెడ్డి సమాధానమిస్తూ ఇలా అన్నారు."జవహర్ నగర్లో విద్యుత్ స్తంభాలు లేవని నాకు తెలుసు. అంతేకాదు అడ్డగోలుగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తాం,రాత్రివేళల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా అక్రమాలకు పాల్పడుతున్నది ఎవరో కాదు మన నాయకులే అన్న సంగతి కూడా నాకు తెలుసు. అందరూ దొంగలే.. భూకబ్జాలకు పాల్పడుతున్నది మన నాయకులే" అని సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.
నిజం నిర్భయంగా ఒప్పుకున్న మల్లన్నపై నెటిజెన్ల ప్రశంసలు
మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఆపైన సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. నెటిజెన్లు మల్లారెడ్డి మాటలను టిక్ టాక్లో పెట్టి వైరల్ చేస్తున్నారు. అంతేకాదు ఓ నాయకుడు నిజాయితీగా ఒప్పుకోవడంతో పాటు అందరికీ తెలియని రహస్యం కూడా బయటకు చెప్పారంటూ కామెంట్లు చేశారు. వీడియో వైరల్ అవడంతో ఓ విలేఖరి మల్లారెడ్డిని సంప్రదించగా ఆయన ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు. వీడియో చూశాను కానీ అందులో మా నాయకులే భూకబ్జాలకు పాల్పడుతున్నారని తానే అనలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను కొందరు కబ్జాలు చేసి రాత్రి వేళల్లో నిర్మాణాలు చేపడుతూ ఆపై తక్కువ ధరకే అమ్ముతున్నారని మల్లన్న చెప్పారు. ఎవరైతే అలాంటి నిర్మాణాలను కొంటున్నారో తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుందన్నారు. ఎందుకంటే త్వరలోనే కలెక్టర్ కార్యాలయం వారు ఆ అక్రమ కట్టడాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
మొత్తానికి మల్లన్న ఓ రహస్యం బయటపెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు.