ఏమంటారు కేటీఆర్.. చెల్లని రూపాయిల లెక్క తేలిందా..!
Recommended Video
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ప్రచారంలో చెల్లని రూపాయి మాట హాట్ టాపికయింది. అక్కడ చెల్లని రూపాయిలు ఇక్కడ చెల్లుతాయా అంటూ టీఆర్ఎస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన కొందరిని టార్గెట్ చేస్తూ వారు వాడిన పదజాలం రివర్స్ కొట్టింది. అందుకే చెల్లని రూపాయిలు చెల్లినయిగా అంటూ ఎదురు దాడి చేస్తున్నారు విపక్ష నేతలు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 17 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సన్నాహాక సదస్సులకు ఆయనే హాజరయ్యారు. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. సారు.. కారు.. పదహారు అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. అదే సమయంలో విపక్ష నేతలను ఉద్దేశించి చెల్లని రూపాయిలంటూ వ్యాఖ్యానించడం.. తీరా ఫలితాలొచ్చాక చూస్తే అవి చెల్లుబాటుకావడం చర్చానీయాంశమైంది.
మెజారీటి స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు : కేటీఆర్'
చెల్లని రూపాయిలు.. ప్రచారంలో హోరెత్తించిన కేటీఆర్
తెలంగాణ లోక్సభ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే చెల్లని రూపాయిలంటూ కేటీఆర్ నోట వచ్చిన మాట మాత్రం తుపాకి తూటలా పేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలు మళ్లీ లోక్సభకు పోటీచేస్తున్నారని.. అక్కడ గెలవనోళ్లు, ఇక్కడ గెలుస్తారా అన్నది ఆయన ఉద్దేశం. ఆ సమయంలో ఆ మాటలు బాగానే పేలినట్లు కనిపించినా.. ఫలితాలు వచ్చేసరికి తుస్సుమన్నాయి.
ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించిన సన్నాహక సదస్సులకు హాజరైన కేటీఆర్.. ఎక్కడకు పోయినా చెల్లని రూపాయిలంటూ విపక్ష నేతలపై సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే బరిలో చెల్లని రూపాయలు.. ఎంపీ ఎన్నికల్లో ఎలా చెల్లుతాయంటూ ప్రశ్నించారు. అయితే తీరా ఫలితాలొచ్చాక చూస్తే సీన్ రివర్సయింది. 17 స్థానాలకు గాను హైదరాబాద్ ఎంఐఎంకు వదిలిపెట్టిన టీఆర్ఎస్.. మిగతా 16 స్థానాలు మాకే అంటూ లెక్కలేసుకున్నాయి. చివరకు ఫలితాలు చూస్తే కేవలం 9 స్థానాలకే పరిమతమైంది.
ఆ ఐదుగురు.. చెల్లిన రూపాయిలే..!
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. అలాగే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గెలవలేకపోయారు. అయితే వీరంతా కూడా మరోసారి తమ అదృష్టం పరీక్షించుకోవడానికి లోక్సభ ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. ఆ మేరకు పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సోయం బాపురావు.. ఆదిలాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభ బరిలో దిగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఎంపీలుగా మరోసారి రంగంలోకి దిగడంతో కేటీఆర్ అస్త్రంగా మలచుకోవాలని చూశారు. ఎక్కడికి వెళ్లినా వారిని చెల్లని రూపాయిలంటూ సంబోధించారు. వారిని దెబ్బకొట్టేలా చూసిన కేటీఆర్ వ్యూహం ఫలించలేదని చెప్పొచ్చు. 16 స్థానాల్లో గెలుస్తామంటూ గాంభీర్యం ప్రదర్శించారు కేటీఆర్. చివరకు ఫలితాలు వస్తే గానీ అసలు విషయమేంటో బోధపడలేదు.
బీజేపీకి మంచి మలుపు.. గొప్ప విజయం..!
కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆరు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను ఓడించి భువనగిరి ఎంపీగా గెలుపొందారు.
హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి చెందారు. సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసి మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ పై దాదాపు 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి అపజయం చవిచూసిన బండి సంజయ్.. అదే స్థానం నుంచి లోక్సభ బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై దాదాపు 90 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఇక బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన సోయం బాపురావు.. అనూహ్యంగా కమల తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్పై దాదాపు 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
మీ చెల్లని రూపాయిలు కూడా చెల్లినట్లేగా..!
అదలావుంటే చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి చవిచూసిన బోర్లకుంట వెంకటేశ్కు అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ఎం. చంద్రశేఖర్పై ఆయన విజయం సాధించారు. ఇక ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వర రావు.. టీఆర్ఎస్ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై గెలుపొందారు. దాంతో మీ చెల్లని రూపాయలు కూడా చెల్లినయిగా కేటీఆర్ సారూ అంటూ ఎద్దేవా చేస్తున్నారు కొందరు.
మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారిని చెల్లని రూపాయిలంటూ ఎద్దేవా చేయడం.. చివరకు వారు ఎంపీలుగా గెలవడంపై కేటీఆర్ సమాధానమేంటనే చర్చలు జోరందుకున్నాయి. మీకు చెల్లని రూపాయిలుగా కనిపించినవి.. ఇప్పుడు చెల్లినట్లేనని ఒప్పుకుంటారా అనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.