ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ హవా.. ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నవీన్ రావు యునానిమస్గా ఎన్నికయ్యారు. ఆ మేరకు అధికారులు అఫిషియల్గా ప్రకటించారు. అసెంబ్లీ సెక్రటరీ ఆయనకు ధృవీకరణ పత్రం అందించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రావు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నవీన్ రావుకు పోటీగా వేసిన ఇతర నామినేషన్ తిరస్కరణకు గురైంది. కొన్ని కారణాలతో ఆ నామినేషన్ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో.. ఆ సమయం పూర్తయ్యాక నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
కేసీఆర్ ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు.. 2023లో అధికారం మాదే : లక్ష్మణ్
మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో.. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దాంతో టీఆర్ఎస్ నుంచి కుర్మయ్యగారి నవీన్ రావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి, నవీన్రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం ఒకే స్థానానికి ఖాళీ ఏర్పడటంతో తొలుత నవీన్రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్రెడ్డికి అవకాశం కల్పించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
లోక్సభ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి నుంచి నవీన్ రావు పేరు దాదాపుగా ఖరారయినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని బరిలోకి దించగానే కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టే క్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలో దించారు. ఆ క్రమంలో నవీన్ రావుకు మల్కాజిగిరి సీటు తృటిలో చేజారిపోయింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కన్ఫామ్ చేశారు కేసీఆర్. అయితే నవీన్ రావు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.