రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్- ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ బుధవారం సాయంత్రం నాటితో ప్రచార పర్వానికి తెరపడింది.
ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్లకు.. ఎలక్షన్ కమిషన్ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తోంది.
వివిధ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యూయేషన్ లో ఉన్న టీచర్లకు, లెక్చరర్లకు, ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ మంజూరైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఓటేసేలా ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.