టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ దెబ్బ.. 3 స్థానాల్లో ఔట్.. కాంగ్రెస్కు కొత్త శక్తి..!
హైదరాబాద్ : ఎమ్మెల్యే ఎన్నికల్లో సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో పాగా వేసింది. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్కాబొర్లా పడింది. వరుస విజయాలతో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన గులాబీ వనానికి ముళ్లబాట ఎదురైంది. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పరాజయం పాలుకావడం చర్చానీయాంశమైంది. ఎమ్మెల్సీ ఫలితాల దెబ్బతో అధికార పార్టీ కుదేలయిందనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే లోక్సభ ఎన్నికలున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గులాబీ కోటలో హస్తం.. జీవన్ రెడ్డి హవా
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అవతారమెత్తిన కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. 119 స్థానాలకు గాను కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి టీఆర్ఎస్ హవాకు కుదేలైంది. అయితే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంతో.. కాంగ్రెస్ కు కొత్త శక్తి వచ్చినట్లైంది.
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్రెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ కు చెందిన సమీప ప్రత్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పై 39,430 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 17 మంది పోటీపడగా.. లక్షా 15 వేల 458 ఓట్లు పోలయ్యాయి. జీవన్రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు.
అయితే ఇటీవల వరుసగా హస్తం గూటి నుంచి చేజారిపోయి కారెక్కుతున్న నేతల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చినట్లైంది. టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్ 17, 268 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా.. బీజేపీ బలపరిచిన సుగుణాకర్ రావు 15, 077 ఓట్లతో మూడోస్థానం దక్కించుకున్నారు. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ 5,192 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 9, 932 ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించారు.
లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?
గులాబీ "పూల" కు నర్సిరెడ్డి దెబ్బ
వరంగల్-నల్గొండ-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గులాబీ దండు బలపరిచిన పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ఈయన గతంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
మొత్తం 18 వేల 885 ఓట్లు పోలవ్వగా నర్సిరెడ్డికి 8, 976.. పూల రవీందర్కు 6, 279 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో విజయానికి 9,014 ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్యత కింద నర్సిరెడ్డికి 8,976 ఓట్లు వచ్చాయి. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఆయన గెలుపొందినట్లు ప్రకటించారు అధికారులు.
2 కోట్ల 96 లక్షలకు పైగా తెలంగాణ ఓటర్లు.. జిల్లాల వారీగా లెక్కలివే..!
అయ్యో పాతూరి.. రఘోత్తం విజయం
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్ రెడ్డి ఈసారి ఔటయ్యారు. సమీప ప్రత్యర్తి మోహన్ రెడ్డిపై 1,707 ఓట్ల మెజార్టీతో రఘోత్తం రెడ్డి గెలుపొందారు.
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ గా వ్యవహరించిన పాతూరికి పరాభవం తప్పలేదు. ఏకంగా నాలుగో స్థానానికి పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఈ స్థానంలో మొత్తం 19 వేల 346 ఓట్లు పోలవ్వగా.. 532 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 18,814 ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి రఘోత్తం రెడ్డికి తొలి ప్రాధాన్య ఓట్లు 5,462 దక్కాయి. మోహన్ రెడ్డికి 4,253 ఓట్లు, మామిడి సుధాకర్ రెడ్డికి 2,631 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్ రెడ్డికి 2,486 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత 1,707 ఓట్ల మెజారిటీతో రఘోత్తం విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
కాంగ్రెస్ జోష్.. ముందుంది పార్లమెంటరీ బరి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరట అని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఇతర పార్టీలు కనిపించకుండా టీఆర్ఎస్ హవా కొనసాగిస్తున్న క్రమంలో ఈ రిజల్ట్స్ గులాబీశ్రేణులకు పెద్ద షాక్. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రధానంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటపడిందనే ప్రచారం జోరందుకుంది. ఐఆర్, పీఆర్సీ ఇవ్వకపోవడం.. సీపీఎస్ పై ప్రభుత్వ వైఖరి, భాషా పండితుల అప్గ్రేడేషన్ వంటి అంశాలు ప్రభావం చూపాయనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని శక్తి తెచ్చిపెట్టాయనే వాదన వినిపిస్తోంది.