ఈ రెండేళ్లలో బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారు..? జీహెచ్ఎంసీలో సెంచరీ పక్కా : కవిత
కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రెండేళ్ల కాలంలో నగరానికి ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కరీంనగర్కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ ఎందుకు రాకుండా పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన 20 ఏళ్లలో మునుపటికంటే ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైందని... కానీ బీజేపీ నేతలు వాస్తవాలు పక్కనపెట్టి పోలింగ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బుధవారం(డిసెంబర్ 2) తొలిసారి కవిత కరీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్తో కలిసి కరీముల్లాషా దర్గాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు.గతంతో పోల్చితే నగరంలో ఎక్కువ పోలింగ్ నమోదైందన్నారు. కరీంనగర్ గురించి ప్రస్తావిస్తూ.. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పటికే రూ.1వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నామన్నారు.
కాగా,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓటు వేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసిన కవిత.. తాజాగా జీహెచ్ఎంసీలో ఓటు వేయడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. ఒక చోట ఓటు హక్కు ఉన్న ఓటర్, మరో చోట ఎలా ఓటు వేస్తారని బీజేపీ ప్రశ్నించిన బీజేపీ.... వెంటనే కవితను ఎమ్మెల్సీగా డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది.
అటు కాంగ్రెస్ పార్టీ కూడా కవిత ఓటు వ్యవహారంపై మండిపడింది. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం పోతంగల్ లో ఓటు హక్కు కలిగిన కవిత.. ఇప్పుడు బంజారాహిల్స్ లో ఓటు వేయడమేంటని టీపీసీసీ అధికార ప్రతినిది ఇందిరా శోభన్ ప్రశ్నించారు. పోతంగల్లో ఉన్న ఓటును తొలగించకుండానే... బంజారాహిల్స్లో ఎలా రెండో ఓటు వేశారని నిలదీశారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగపరచడమేనని.. దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు.