హైదరాబాద్ లో మోడీ సభ.. కమలనాథుల్లో కొత్త ఉత్సాహం.. భారీ ఏర్పాట్లు
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ. ప్రధాని మోడీతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారపర్వం హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈ అగ్రనేతల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీనికితోడు అటు స్వామి పరిపూర్ణానంద సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు మోడీ.
సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సభా ఏర్పాట్లను సీనియర్ నేతలు పరిశీలించారు. మోడీ పాల్గొంటున్న ఈ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్ నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా తదితర ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణకు సిద్ధమయ్యారు రాష్ట్ర నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు సీనియర్లు 40 మంది వరకు కూర్చునేలా వేదికను రూపొందిస్తున్నారు.