జగన్, కేసీఆర్లకు కేంద్రం పిలుపు.. ఈ నెల 19న మరోసారి అఖిలపక్ష భేటీ..
ఢిల్లీ : కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఈ నెల 19న మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పలు కీలక అంశాలపై మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించింది. చాలాకాలంగా వినిపిస్తున్న ఒక దేశం ఒకేసారి ఎన్నికల అంశంపై మోడీ సర్కారు కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు మోడీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
లోక్సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధినేతలను మోడీ ఆల్ పార్టీ మీటింగ్కు ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి ఇప్పటికే లేఖ పంపారు. భేటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంతో పాటు మరో నాలుగు అంశాలపైనా చర్చించనున్నారు.
మోడీ నేతృత్వంలో ఆల్పార్టీ మీట్... కీలక బిల్లులపై తగ్గేదిలేదంటున్న ప్రతిపక్షాలు..
ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతుత్సవాలు జరగనున్నాయి. వీటి నిర్వహణతో పాటు 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఉత్సవాలు ఎలా నిర్వహించాలన్న దానిపై సమావేశంతో చర్చించనున్నారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి పార్లమెంటు సభ్యులకు విందు ఇవ్వనున్నారు. ఈ నెల 20న జరగనున్న ఈ కార్యక్రమానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఎంపీల్లో టీమ్ స్పిరిట్ నింపేందుకు విందు ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.