చిన్న బండి.. పెద్ద ఫైన్.. కొత్త చట్టంతో వాహనదారుడికి ఫుల్లు జరిమానా..!
హైదరాబాద్ : బండేమో చిన్నది.. కానీ ట్రాఫిక్ పోలీసులు వేసిన జరిమానేమో పెద్దది. తిప్పి కొడితే సదరు టూ వీలర్ను అమ్మితే 7-8 వేలు రావు.. కానీ ట్రాఫికోళ్లు వేసిన ఫైన్ చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 వేల రూపాయల జరిమానా వేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండని మొత్తుకుంటున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. అందుకే కొత్త మోటారు వాహనాల చట్టం కింద అడ్డంగా బుక్ చేసేస్తున్నారు.
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చింది. ఆ నేపథ్యంలో హైదరాబాద్లో వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినోళ్ల జేబుకు చిల్లులు పడుతున్నాయి. అదే క్రమంలో హైదరాబాద్లో నివసిస్తున్న హర్యానాకు చెందిన ముకుల్ అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు బుధవారం నాడు అడ్డంగా దొరికిపోయాడు. ఆయన నడుపుతున్న స్కూటీ వాహనానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేని కారణంగా అవీ ఇవీ అన్నీ వడ్డించి 16 వేల రూపాయల మేర జరిమానా వేశారు.
జై జై గణేశా.. బై బై గణేశా.. మూడో రోజు నుంచే నిమజ్జనం.. భారీ బందోబస్తు..!
డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు.. స్కూటీ నడుపుతున్నాడే తప్ప అతడి దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. దాంతో ఏకంగా 16 వేల రూపాయల భారీ జరిమానా పడింది. ఆ మేరకు అతడి నుంచి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొత్త మోటార్ వాహన చట్టం ద్వారా భారీగా జరిమానాలు పడుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మంగళవారం నాడు హర్యానాలో జరిగిన ఘటన కూడా ఇలాంటి సీన్ తలపిస్తోంది. గురుగ్రామ్కు చెందిన దినేశ్ మదన్ అనే వ్యక్తికి 23 వేల ఫైన్ వేశారు పోలీసులు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్.. ఇలా ఏ ఒక్కటి లేకపోవడంతో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం గమనార్హం.