మోదీకి బదులు నా ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు... గ్రేటర్లో బీజేపీ ప్రచారంపై ఓవైసీ కౌంటర్...
గ్రేటర్ ఎన్నికల సమరంలో నేతల మాటలు అగ్గి పుట్టిస్తున్నాయి. జరుగుతున్నది గల్లీ ఎన్నికలే అయినా పార్టీల ప్రచార పర్వం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ... గ్రేటర్ ప్రచారంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ టీఆర్ఎస్,ఎంఐఎంలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు,సవాళ్లు.. అందుకు అవతలివైపు నుంచి వస్తున్న ప్రతిసవాళ్లు,ప్రతివిమర్శలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రోహింగ్యాలు,పాకిస్తాన్ గుర్తొస్తాయని అన్నారు. పాతబస్తీలో పాకిస్తానీలు,రోహింగ్యాలు ఉంటే... ఆరున్నరేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నా పట్టించుకోని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ బీజేపీ తరుపున ప్రచారానికి కేంద్రమంత్రులంతా హైదరాబాద్లో దిగుతున్నారని... వరదల సమయంలో వీళ్లంతా ఎందుకు ఇక్కడికి రాలేదని ప్రశ్నించారు. వరద బాధితులకు కేంద్రం ఒక్క పైసా సాయం అందించలేదన్నారు. హైదరాబాద్లో గొడవలు సృష్టించేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మోదీ ఫోటో కాకుండా తన ఫోటోతో ఓట్లు అడుగుతోందని ఎద్దేవా చేశారు. చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం బీజేపీకి లేదని... అలా చేస్తే తాను కూడా కేంద్రాన్ని ప్రశంసిస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు.
కాగా,పాతబస్తీలో రోహింగ్యాలు,పాకిస్తానీలు,అక్రమ చొరబాటుదారులు ఉన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ మేయర్ పీఠం బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపి వారిని తరిమి తరిమి కొడుతామన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాట్లాడుతూ.. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు,దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్లను మొదట కూల్చివేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అదే జరిగితే రెండే గంటల్లో దారుసలాంను కూల్చివేస్తామన్నారు. పీవీ,ఎన్టీఆర్ ఘాట్ల రక్షణను బీజేపీ తీసుకుంటుందని గురువారం(నవంబర్ 26) అక్కడికి వెళ్లి ప్రమాణం చేస్తానన్నారు.