ఓటరు దేవుడు హాలీడే ట్రిప్ కు వెళితే !? ఎన్నికల వేళ పార్టీలకు పెద్ద టెన్షన్ !
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన నేతలకు సెలవుల భయం పట్టుకుంది. నేతలేంటి.. సెలవులేంటి.. ఇంతకు వారికొచ్చిన భయమేంటి అనుకుంటున్నారా?. ఎర్రటి ఎండలో చెమటలు చిందిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న నేతల గుండెల్లో హాలిడేస్ గుబులు పుట్టిస్తున్నాయి. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఓట్లు రాలుతాయా? లేదంటే సెలవుల మూడ్లో జనం పోలింగ్కు దూరంగా ఉంటారా అనే టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్ సమయంలో వరుస సెలవులు రావడంపై ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
వరుస సెలవులు.. పోలింగ్ ఓకేనా?
ఈనెల 11న గురువారం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రోజు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హాలిడే ఇచ్చింది. అయితే 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన నేతలు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే 12వ తేదీ శుక్రవారం సెలవు పెట్టుకుంటే ఉద్యోగులకు 4 రోజులు కలిసివస్తాయి. దాంతో ఓటర్లు విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారేమోననేది వారి ఆందోళనకు కారణం.
అసెంబ్లీ ఎన్నికల వేళ..!
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ పోలింగ్ పై సెలవులు తీవ్ర ప్రభావం చూపాయి. డిసెంబర్ 7, శుక్రవారం రోజు ఎన్నికల సందర్భంగా సెలవు.. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు. అలా 3 రోజులు కలిసి రావడంతో నగరవాసులు జాలీ ట్రిప్స్ కు వెళ్లారేమో అనే విధంగా.. పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. అప్పుడు రాష్ట్రమంతటా 73.20 శాతం పోలింగ్ నమోదైతే.. హైదరాబాద్ లో కనీసం 50 శాతం నమోదు కాకపోవడం గమనార్హం. పోలింగ్ తేదీ తర్వాత సెలవుదినాలు వస్తే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది నేతల వాదన.
ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రచారం
వరుస సెలవులతో ఓటింగ్ తగ్గొచ్చనే కారణంతో ఆయా పార్టీలు ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఓటు హక్కు ప్రాధాన్యంపై చైతన్యం కలిగిస్తున్నాయి. నాలుగు రోజులు ఎంజాయ్ చేయడానికి చూస్తారా? దేశ భవిష్యత్తు కాపాడేలా ఓటేస్తారా? అంటూ బీజేపీ శ్రేణులు జనాలకు వివరిస్తున్నారు. మీరు విహార యాత్రలకు వెళితే పాకిస్థాన్ కు వరమవుతుంది.. అదే బీజేపీకి ఓటేస్తే దేశం బాగుపడుతుందంటూ ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఇప్పుడు జరగొద్దని సూచిస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది ఓట్లు వేసి ఉంటే ఫలితాలు మరో తీరుగా వచ్చి ఉండేవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆనాటి నిర్లక్ష్యం వద్దంటూ హితవు పలుకుతున్నారు. సెలవులు, ఎంజాయ్ అని చూడకుండా ఓటు హక్కు వినియోగించాలని కోరుతున్నారు.