జర్నలిస్టులు దీక్ష చేస్తున్నారంటే ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క.!టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ : విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నారని, అయినప్పటికి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కఠినంగా వ్యవహరిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలకోసం ఒకరోజు ఉపావాస దీక్షను తలపెట్టింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. ఈ నేపథ్యలో జర్నలిస్టుల ఉపవాస దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం మర్చిపోయందని అన్నారు.
జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ మర్చిపోయారు.. దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు మద్దత్తు తెలిపిన రేవంత్ రెడ్డి..
విధులను కాదని ముందుకు వచ్చి దీక్ష చేస్తున్నరంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అంశం అర్ధమవుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టులను ప్రభ్యత్వం భేషరతుగా ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని, 15 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి పెరిగిన సందర్బంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు మరిచిందని ప్రశ్నించారు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరోనా పేషంట్స్ కోసం ఖర్చు పెడుతున్నామని చెప్తున్న ప్రభుత్వం, మృతి చెందిన మనోజ్ కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు.
కరోనా రోగులకు తెలంగాణ సర్కార్ ఎంత ఖర్చు చేస్తుంది..? మనోజ్ కోసం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలన్న రేవంత్..
అంతే కాకుండా మనోజ్ గాంధీ లో చేరిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా బహిర్గతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసారను. తెలంగాణలో ఇప్పటి వరకు కనీసం 50 వేల టెస్టులు కూడా చేయలేదని, దీంతో కరోనా మహమ్మారి పట్ల సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందన్నారు రేవంత్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా సోకితే యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, అదే సామాన్యులను, జర్నలిస్టులను ఎందుకు అనుమతించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
జర్నలిస్టుల ప్రశ్నలు కేసీఆర్ కు చికాకు కలిగిస్తున్నాయి.. కేసీఆర్ లో అసహనం పెరిగిందన్న ఎంపీ..
అంతే కాకుండా వచ్చే వారం వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ను పదవి నుండి తొలగిస్తున్నారని, అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ పరిస్థితులను కల్పిస్తున్నారని రేవంత్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేసారు. బషీర్ బాగ్ లో ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తున్న జర్నలిస్టుల సహాయ నిధికి రేవంత్ రెడ్డి 2లక్షల రూపాయల చెక్ ను అందజేసారు. జర్నలిస్టులు తమ న్యాయమైన డిమాండ్ల అమలుకోసం చేసే పోరాటానికి తన మద్దత్తు ఎప్పటికి ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Recommended Video
మనోజ్ చట్టం తేవాలి.. డిమండ్ చేస్తున్న పాత్రికేయ నాయకులు..
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో జర్నలిస్టు మనోజ్ ను కరోనా పేరుతో ప్రభుత్వం హత్య చేసిన విషయం తెలంగాణ సమాజానికి తెలిసిందేనని దీక్ష చేస్తున్న జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో మనోజ్ కు జరిగిన అన్యాయం మరే ఇతర జర్నలిస్టుకు జరగకూడదనే ఉద్దేశంతో, జర్నలిస్టు మనోజ్ చట్టం తేవాలని, అందుకోసం ఉద్యమాన్ని చేపట్టాలని జర్నలిస్టు నాయకులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకు అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నామని పాత్రికేయ నాయకులు తెలిపారు. అందులో భాగంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు చేపట్టబోతున్నట్టు తెలిపారు.