ఇది విశ్వనగరమా... మురికి కూపమా .. కేటీఆర్ ఎక్కడ..? రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు ముంచెత్తడంతో వరద కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. నేడు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్ ఎక్కడా కనిపించరేం అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలు పడుతుంటే కేటీఆర్ కు కనిపించడం లేదా అంటూ నిలదీశారు.
ఎల్బీ నగర్ లో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి
ఎల్బీనగర్ నియోజకవర్గం లోని పి ఎన్ టి కాలనీ లో నీట మునిగిన ప్రాంతాలను స్థానిక ప్రజలతో కలిసి సందర్శించారు రేవంత్ రెడ్డి. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరూర్ నగర్ దగ్గర వరద ముంపు పరిస్థితులను స్థానికులతో కలిసి పర్యవేక్షించారు. ఇది విశ్వ నగరమా.. మురికి కూపమా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని ప్రభుత్వం వైఫల్యం అంటూ మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల చెరువుల కబ్జాల వల్లే నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు.
అభివృద్ధి అంటే ఇదేనా ? మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అతని అనుచరులు చెరువులు, శిఖం భూములను కబ్జా చేశారని మండిపడ్డారు.నగరంలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే మంత్రులకు అధికారులకు పట్టింపు లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అని చెప్పిన సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఏళ్ల తరబడి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని, ఇప్పటివరకు ఎందుకు నగరంలోని సమస్యలు పరిష్కరించ లేకపోయారు అని నిలదీశారు. మంత్రి కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
Recommended Video
పనికిమాలిన విషయాలపై కేసీఆర్ ఫోకస్ .. కేటీఆర్ కు ప్రజల కష్టాలు పట్టవా ?
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లోనో , వీడియో కాన్ఫరెన్స్ లోనో తప్ప బయట ఎక్కడా కనిపించరా అంటూ ఎద్దేవా చేశారు. ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవాలను అట్టహాసంగా చేస్తూ హాజరవుతున్న కేటీఆర్, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పనికిమాలిన అంశాలమీద సమీక్షలు చేస్తున్నారు కానీ, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరద ముంపుకు గురైన ఎల్బీనగర్లోని పలు కాలనీల్లో ప్రజలకు వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లిందని, వరద నష్టాన్ని అంచనా వేసి తక్షణం బాధితులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.