నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి రైలు సర్వీసులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గవర్నర్ అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండా మెట్రో రైలు సేవలు ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి.
ఒకే రైలులో నాగోల్ హైటెక్ సిటీ ప్రయాణం
ఈ రూట్ లో సర్వీసులు మొదలుకావడంతో ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణీకులు ఒకే రైలులో గమ్యానికి చేరుకోవచ్చు. అయితే ఎల్బీ నగర్ మియాపూర్ కారిడార్ నుంచి వచ్చే ప్యాసింజర్లు మాత్రం అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లో రైలు మారాల్సి ఉంటుంది.
అమీర్ పేట్ హైటెక్ మార్గంలో 9 స్టేషన్లు
అమీర్ పేట హైటెక్ సిటీ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. అమీర్ పేట్ నుంచి మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, మీదుగా ట్రైన్ హైటెక్ సిటీ స్టేషన్ కు చేరుకోనుంది. అయితే వీటిలో జూబ్లీహిల్స్, చెక్ పోస్ట్ పెద్దమ్మ గుడి, మాదాపూర్ స్టేషన్లలో మాత్రం ప్రస్తుతానికి మెట్రో రైళ్లు ఆగవు. అమీర్ పేట్ - హైటెక్ సిటీ మార్గంలో ఎక్కువ మలుపులు ఉన్నందున సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించింది. ఈ కారణంగా ఈ మూడు స్టేషన్ల ప్రారంభానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
ఐటీ ఉద్యోగులకు ఊరట
మెట్రో టైన్స్ రాకతో ఈ రూట్లో ట్రాఫిక్ జాం సమస్య తగ్గే అవకాశముంది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పలు సాఫ్ట్ వేర్ , కార్పొరేట్ కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న వీరంతా రోజూ తమ ఆఫీసులకు వచ్చి వెళ్లేందుకు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీస్ ప్రారంభం కావడంతో వారి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.