ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. కడసారిగా చూసి అభిమానుల కన్నీరు
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ముఖేష్ గౌడ్ కన్నుమూయడంతో హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు కోల్పోయినట్లైంది. కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించడమే గాకుండా ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆయన మృతి పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అదలావుంటే ఆయన పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం (30.07.2019) నాడు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో ఉంచనున్నారు.
ముఖేష్ గౌడ్ కన్నుమూత: భాగ్యనగరంలో కాంగ్రెస్ కీలక నేతగా: కేన్సర్తో పోరాడి...!
ఉదయం 11 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో షేక్పేట గౌడ సమాజ్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ మేరకు కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించారు.
1959 జులై ఒకటో తేదీన జన్మించిన ముఖేష్ గౌడ్ 60 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గత ఏడు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూ చివరకు సోమవారం (29.07.2019) నాడు మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నగర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ముఖేశ్ గౌడ్ మరణం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. సీఎం కేసీఆర్ ముఖేశ్ గౌడ్ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.
హైదరాబాద్ నగరమంతటా అభిమానులను సంపాదించుకున్న ముఖేశ్ గౌడ్ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్దఎత్తున జనాలు తరలివస్తున్నారు. అంతిమయాత్రకు పెద్దసంఖ్యలో పబ్లిక్ వస్తారనే అంచనాతో ఆ మేరకు పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లలో తలమునకలైంది.