టికెట్ టికెట్.. కండక్టర్ అరుపులు కాదు.. నేతల గుండెల్లో గుబులు..!
హైదరాబాద్ : మున్సిపల్ పోరు కాకా పుట్టిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. నోటిఫికేషన్ రావడమే తరువాయి ఎన్నికల సమరానికి సిద్ధమైన లీడర్లకు టికెట్ల టెన్షన్ పట్టుకుంది. ఇక ఒకే వార్డులో టికెట్ కోసం ముగ్గురు నలుగురు నేతలు ప్రయత్నిస్తుండటంతో ఎవరికి ఇవ్వాలనే అంశంలో తర్జనభర్జన పడుతున్నారు పార్టీల పెద్దలు. అయితే కొన్నిచోట్ల యువజన సంఘాల ప్రతినిధులు, ఆయా కులాల సంఘాల నేతలు ఈసారి కౌన్సిలర్ కుర్చీపై ఖర్చీఫ్ వేసేందుకు ట్రై చేస్తుండటం, ప్రధాన పార్టీల టికెట్లపై కన్నేయడం చూస్తుంటే మరింత కన్ఫ్యూజన్ తప్పేటట్లు లేదు.
టీఆర్ఎస్ నేతల బాటలో బీజేపీ ఎంపీ..! అధికారులొస్తే కొట్టండి..
టికెట్ల పంచాయితీ.. పార్టీ పెద్దలకు తలనొప్పే..!
మున్సిపల్ ఎన్నికల పర్వం ప్రధాన పార్టీల బాధ్యులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా పోటీ ఉంటుండటంతో ఎవరికి ఇవ్వాలనే విషయంలో డైలామా నడుస్తోంది. నోటిఫికేషన్ రానున్న తరుణంలో టికెట్ల పంపిణీ ఇబ్బందికరంగా మారింది. అదలావుంటే టికెట్ తమకే ఇవ్వాలంటూ కొందరు పట్టుబడుతుండటం.. ఆ మేరకు పైరవీలు చేయడం చూస్తుంటే పార్టీ బాధ్యులకు ఈసారి టికెట్ల పంపిణీ తలకు మించిన భారంగా కనిపిస్తోంది.
రిజర్వేషన్లు ఖరారు కానే లేదు.. అప్పుడే రేసులో..!
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో అన్నట్లుగా ఉన్న ఈ తరుణంలో కొందరు లీడర్లు ఇప్పటికే వార్డుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించుకుంటున్నారు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తలమునకలయ్యారు. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ ఈసారి కౌన్సిలర్ కావాల్సిందే అని కంకణం కట్టుకున్న నేతలు వార్డుల్లో తిరుగుతున్నారు. ఓటర్ లిస్టులు చేతబట్టి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కలేస్తున్నారు.
అదలావుంటే కొందరు మాజీ కౌన్సిలర్లు తమ పట్టు కోల్పోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి కొందరు నేతలు రావడం.. యువజన, కుల సంఘాల ప్రతినిధులు టికెట్ కోసం ప్రయత్నిస్తుండటంతో మాజీలు అలర్టవుతున్నారు. ఈసారి కూడా పార్టీ టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సీన్ రివర్సయి టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. కొన్నిచోట్ల వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల్లో ఆశావహులు చాలా మంది ఉండటంతో టికెట్ ఎవరికి ఇవ్వాలనేది ముఖ్య నేతలకు తలనొప్పిగా మారనుంది.
అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయితీ
అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కేటాయింపు పర్వం మాత్రం టెన్షన్ పుట్టిస్తోంది. రాష్ట్రంలో కారు జోరు హవా తప్ప ఇతర పార్టీల జాడ లేని కారణంగా టీఆర్ఎస్ గుర్తు మీద పోటీచేస్తే తప్పకుండా గెలుస్తామనేది అభ్యర్థుల ఇంటెన్షన్గా కనిపిస్తోంది. దాంతో కారు టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో రిజర్వేషన్లు ప్రకటించకముందే టికెట్ల వేటలో పరుగులు పెడుతున్నారు కొందరు నేతలు.
ప్రస్తుత వాతావరణం చూస్తే టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నేతలు, పార్టీలో కొత్తగా చేరినవారు.. ఇలా మూడు గ్రూపులుగా ఏర్పడినట్లు కనిపిస్తోంది. మాజీ కౌన్సిలర్లు అభివృద్ధి చేశామనే పాట పాడుతుంటే.. సీనియర్లేమో మాకెప్పుడు ఛాన్స్ వస్తుందంటూ ఆరాటపడుతున్నారు. ఇక కొత్తగా పార్టీలో చేరిన నేతలేమో.. టికెట్ ఇస్తామంటేనే జంప్ అయ్యామని వాదిస్తున్నారు. అలా అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల రేసు తలనొప్పిగా మారింది. ఈ మూడు గ్రూపుల నేతల్లో ఎవరికో ఒకరికి మాత్రమే టికెట్ దక్కనుంది. ఆ క్రమంలో మరో ఇద్దరు రెబెల్స్గా మారే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!
ఛైర్మన్ గిరిపై కన్ను.. రిజర్వేషన్లను బట్టి రంగంలోకి..!
అదలావుంటే ఇక ఛైర్మన్ కుర్చీపై కన్నేశారు కొందరు నియోజకవర్గ స్థాయి నేతలు. మున్సిపాలిటీ ఛైర్మన్ రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తే కచ్చితంగా కౌన్సిలర్గా పోటీచేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ కన్ఫామ్ ఐతే భార్యలను పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదలావుంటే మున్సిపల్ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులేస్తున్నారు పార్టీల పెద్దలు. మొత్తానికి మున్సిపల్ స్థానాలను అత్యధికంగా కైవసం చేసుకోవాలనే టీఆర్ఎస్ ఎత్తుగడలకు పార్టీశ్రేణులు ఏవిధంగా సపోర్ట్ చేస్తాయోననే టాక్ వినిపిస్తోంది.