కేటీఆర్ కు కొత్త కష్టాలు తెచ్చిన మునిసిపల్ ఎన్నికల వ్యూహం .. కేటీఆర్ ఏం చేస్తారో ?
తెలంగాణా రాష్ట్రంలో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలు టీఆర్ ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించినా , కేటీఆర్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ప్రతీ టాస్క్ని సక్సెస్ చేసి తానేమిటో నిరూపించుకుంటున్న వేళ మునిసిపల్ ఎన్నికల ద్వారా తెచ్చి పెట్టుకున్న సమస్యలు ఆయన పరిష్కరిస్తారా అనేది ఇప్పుడు పార్టీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్న అంశం . ఇంతకీ ఆ కష్టాలేంటి ? కేటీఆర్ పడుతున్న ఇబ్బంది ఏంటి అంటే
మునిసిపల్ ఎన్నికల మేనిఫెస్టో లోకల్గా విడుదల నేతలు
మున్సిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లోకల్గా విడుదల చేసింది. స్వయంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో స్థానిక సమస్యలు వాటి పరిష్కారాలపై మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్తూ మేనిఫెస్టోను ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చటం కోసం ప్రజల నుండి ఒత్తిడి ఎదురవుతుంది.
నిధులు కేటాయించాలని కేటీఆర్ మీద పెరుగుతున్న ఒత్తిడి
ఎమ్మెల్యేలు ప్రజల ఒత్తిడి నుండి బయటపడటానికి మున్సిపల్ శాఖా మంత్రిని కొన్ని నిధులైనా కేటాయించాలని కోరుతూ ఆయన చుట్టూ , ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదే కేటీఆర్ ను ఇబ్బంది పెడుతున్న అంశం . ఇక త్వరలో ఫిబ్రవరి మూడో వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు కోసం ఎమ్మెల్యేలు మ్యానిఫెస్టోలు చేత పట్టుకొని జిల్లా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు .
ఎవరికి వారు సొంత స్థానిక మ్యానిఫెస్టో ప్రచారం చెయ్యటంతో పెరగనున్న ఆర్ధిక భారం
ఇక హామీలిచ్చి కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా స్థానిక ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే కొంత ఒత్తిడి తగ్గుతుందని స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ కార్పొరేషన్లో పర్యటనల హామీలే ఇంకా నెరవేరలేదు. ఇక తాజాగా ఎన్నికల్లోనూ ఎవరికి వారు స్థానిక మ్యానిఫెస్టోను ప్రచారం చేసుకున్నారు. ఎవరికి వారు సొంత స్థానిక మ్యానిఫెస్టో ప్రచారం చెయ్యటంతో ఆర్ధిక భారం పెరగనుంది.
ఖజానా ఖాళీ .. బడ్జెట్ లో భారీ కేటాయింపులు కావాలంటున్న ఎమ్మెల్యేలు
ఈ క్రమంలో ఈ బడ్జెట్లో అయిన ఒక్కొక్క మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో కేటాయిస్తే పనులు ప్రారంభించవచ్చని ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్తున్నారు . అది జరగకపోతే స్థానికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. అసలే ఆర్ధిక మాంద్యం ప్రభావంతోం తెలంగాణా ఖజానా ఖాళీగా ఉన్న సమయంలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తెచ్చిపెట్టుకున్న సమస్య పరిష్కరించటం కోసం కేటీఆర్ తల పట్టుకుంటున్నారని తెలుస్తుంది.