పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కితాబు .. ఏమన్నారంటే
కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో వైద్యులు , పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి .ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారిని అందరూ దేవుళ్ళుగా భావిస్తున్నారు. పల్లెలను , పట్టణాలను , నగరాలను కరోనా మహమ్మారి నుండి కాపాడటం కోసం పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారు.
వేతనాలు చెల్లించాల్సిందే.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించవద్దు : పరిశ్రమలకు కేటీఆర్ ఆదేశం
పల్లెల్లో, పట్టణాల్లో కరోనా కట్టడికి సేవలందిస్తున్న పారిశుధ్య సిబ్బంది
కరోనా మహమ్మారికి అడ్డు కట్ట వెయ్యటానికి వీరంతా అడ్డు నిలబడుతున్నారు. అంతా లాక్ డౌన్ తో ఇళ్ళల్లో కూర్చుంటే పారిశుధ్య కార్మికులు మాత్రం విధుల్లో బిజీ బిజీగా ఉన్నారు . మీ ప్రాణాల రక్షణ బాధ్యత మాది అని హామీ ఇస్తున్నారు . ప్రతి పల్లెని, పట్టణాన్ని శుభ్రపరిచి కరోనా వైరస్ విస్తరించకుండా చూస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఆయన ట్విటర్ పేజీలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతగా మనల్ని కాపాడుతున్నారో అర్ధం అయ్యేలా ఒక వీడియోను షేర్ చేశారు.
పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడిన కేటీఆర్ ట్వీట్
ఈ వీడియోలో పారిశుధ్య కార్మికులు ప్రజలను సంరక్షించడానికి చీకటితోనే బయలు దేరి అందిస్తున్న సేవలను , చేసే పనులను చూపించారు . ఇక ఒక్క హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే కాకుండా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో , గ్రామపంచాయితీలలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ప్రస్తుత తరుణంలో నిరుపమానమైనవని కేటీఆర్ తన పోస్ట్ ద్వారా అర్ధం అయ్యేలా చెప్పారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు 21 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. ఈ సమయంలో వారే కనుక సహకారం అందించకుంటే కరోనా కట్టడి సాధ్యం అయ్యేది కాదని ఆ వీడియో ద్వారా అర్ధం అయ్యేలా చెప్పారు.
కరోనాపై యుద్ధంలో ముందు వరుసలో ఉన్న పోరాట వీరులుగా కితాబు
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజూ 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను, 5 వేల స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, సహాయకులు కలిసి ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)కు చెందిన 675 మంది సిబ్బంది కూడా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తున్నారు. 2375 వర్కర్లు 135 యూనిట్లుగా ఎంటమాలజీ విభాగంలో ఫ్యుమిగేషన్ కార్యకలాపాలు చేస్తున్నారు. దీనికోసం 63 వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్లు, 305 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు, కోసం 1,000 పవర్ స్ప్రేయర్లు, 817 క్నాప్సాక్ స్ప్రేయర్లు, ఉపయోగిస్తున్నారు.ఇలా కరోనా పై సాగిస్తున్న పోరాటంలో ముందు వరుసలో యుద్ధం చేస్తున్న పోరాట వీరులుగా పారిశుధ్య కార్మికులకు కితాబిచ్చారు కేటీఆర్.