మున్సిపాలిటీల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..! శ్రేణులకు కేటీఆర్ పిలుపు..!!
Recommended Video
హైదరాబాద్: ఇది సభ్యత్వాల నమోదు సీజన్ లా కనిపిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలతో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.తారక రామారావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగ వాతావరణంలో చురుగ్గా కొనసాగుతోందని తారక రామారావు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సభ్యత్వ నమోదును సోమవారం కే.తారక రామారావు సమీక్షించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలకు తారక రామారావు దిశా నిర్దేశం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు, వృత్తి నిపుణులు, కాలనీ సంఘాల ప్రతినిధులను కలిసి.. వారు సభ్యత్వం స్వీకరించేలా చొరవ చూపాలన్నారు. యువకులు, విద్యావంతులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నందున వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ లైన్ వేదికను ఉపయోగించుకోవాలని కే.తారక రామారావు చెప్పారు.
స్ధానిక కేబుల్ టీవీలు, వాట్సాప్, సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని కే.తారక రామారావు అన్నారు. ఇంటింటికీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకుపోవాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమైనందున ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ అనుబంధ సంఘాలు మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు.
బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అటో డ్రైవర్లు తదితర కార్మిక వర్గాలను నేరుగా వెళ్లి కలవాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వాలు, డిజిటలీకరణ వివరాలు అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సభ్యత్వాలను గడువులోగా పూర్తి చేస్తామని నేతలు కే.తారక రామారావు కు తెలిపారు.