అన్నీ గ్రామాలను చింతమడకల ఎందుకు చేయరు.. కేసీఆర్పై మురళీధర్రావు గుస్సా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ఆయన చేసే తుగ్గక్ చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని సంచలన ఆరోపణలు చేశారు మురళీధర్రావు. వాటి ఎజెండా ఒక్కటేనని కామెంట్ చేశారు. ఇవాళ చింతమడకలో పర్యటించిన కేసీఆర్ .. తన ఊరికి నిధులు ప్రకటించారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలోని మిగతా గ్రామాలను ఎందుకు అభివృద్ధి చేయరని ప్రశ్నించారు. దీంతోపాటు కొత్త మున్సిపల్ చట్టానికి కూడా భవిష్యత్ లేదని మండిపడ్డారు. అంతేకాదు తెలంగాణకు కేంద్రం ఇస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే భయం కేసీఆర్ను వెంటాడుతుందని ఆరోపించారు. అందుకోసమే బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టంచేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరింత మంది బీజేపీలో చేరతారని సూత్రప్రాయంగా తెలిపారు.