ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలు
హైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహానికి హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఖాజా మియా(55) అనే వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. అతడి మృతదేహానికి ముస్లిం స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు స్మశాన నిర్వాహకులు అంగీకరించలేదు. దీంతో స్థానిక యువకులు సందీప్, శేఖర్లు అతడి అంత్యక్రియలను హిందూ స్మశాన వాటికలో నిర్వహించారు. కాగా, ముస్లిం వ్యక్తి అంత్యక్రియలకు అనుమతి నిరాకరించిన ముస్లిం స్మశాన వాటిక నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
సొంత ప్రాంతమైన కర్నూలు(ఆంధ్రప్రదేశ్)కు అతడి మృతదేహాన్ని తీసుకెళదామని భావించామని, అయితే, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టమని, ఇక్కడే అంత్యక్రియలు నిర్వాహించాలని నిర్ణయించినట్లు ఖాజా మియా బంధువు ఒకరు తెలిపారు.
కరోనా విపత్కర సమయంలో ప్రజలు మానవత్వం లేకుండా వ్యవహరించవద్దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. కరోనావైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఘటన హైదరాబాద్ శివారులోని బాలాపూర్లో కరోనావైరస్ రోగుల కోసం ఓ స్మశానవాటిక ఏర్పాటుకు దారితీసింది. ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే కరోనా మృతుల అంత్యక్రియలు జరగాలి. కొద్దిమందిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తారు.