వావ్.. గణనాథుడి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు..
వినాయక నవరాత్రులు ముగిశాయి. ఆ లంభోదరుడిని భక్తులు నిష్టతో కొలిచారు. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం పాట సహజమే. ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావిస్తారు. మంచి జరుగుతుంది విశ్వసిస్తారు. దానిని దక్కించుకుంటే.. తమకు మంచి జరుగుతుందని.. వేలం పాట పాడి మరీ కొనుగోలు చేస్తారు. అయితే అందులో ఇతర మతాలకు చెందినవారు పాల్గొనడం ఆసక్తి కలిగిస్తోంది.
కులమతాలకు అతీతంగా పదిరోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. బాగ్లింగంపల్లి యాదాద్రి కాలనీలో వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారి లడ్డూ వేలం పాట కార్యక్రమం జరిగింది. రూ.72వేల 500కు అదే కాలనీకి చెందిన ముస్లిం యువకుడు ముస్తఫా లడ్డూను కైవసం చేసుకున్నారు. ఓ ముస్లిం యువకుడు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంను కైవసం చేసుకోడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మతాల మధ్య సామరస్యానికి ప్రతీకగా ఈ ఘటన నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.
నవరాత్రుల భక్తుల పూజలు అందుకున్న గణనాథుడిని నిమజ్జనం పూర్తయ్యింది. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పంచముఖ మహా రుద్రగణపతి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జలప్రవేశం చేశాడు. ఆ భారీ గణపయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరడంతో అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ఖైరతాబాద్ గణపతిని ట్యాంక్ బండ్ పై ఉన్న క్రేన్-4 ద్వారా నిమజ్జనం చేశారు. భారీ కొక్కేలకు తగిలించిన వినాయకుడిని నిదానంగా హుస్సేన్ సాగర్ నీటిలోకి దించారు. విగ్రహం పూర్తిగా మునగడంతో నిమజ్జనం పూర్తయింది.
Recommended Video
నిమజ్జనం కోసం పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించారు. డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానం చేసి వాటి ద్వారా అధికారులు పర్యవేక్షించారు. ఎక్కడ ఏం జరిగినా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని డీజీపీ మహేంద్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాలు తమ తమ స్థానాల నుంచి బయలుదేరి.. నిమజ్జన ఘట్టం ముగిసిందని వివరించారు.