అయోధ్య రామ మందిరానికి విరాళాల వెల్లువ.. పోటాపోటీగా మై హోం, మేఘా డొనేషన్స్..
అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇటు మందిర నిర్మాణానికి విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి. ఇవాళ మై హోం, మేఘా కంపెనీలు డొనేషన్స్ ప్రకటించాయి. రెండు కలిపి రూ.11 కోట్ల ఆర్థిక సాయం అందజేశాయి. మిగతా కంపెనీలు కూడా డొనేషన్స్ అందజేశాయి.
అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విరాళాల సేకరణ ప్రారంభమైన ఇవాళే కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు ఇచ్చారు. అపర్ణ కన్స్స్ట్రక్షన్స్ తరపున రూ. 2 కోట్లు రాగా... డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ లో ఉన్న త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో మైహోమ్ గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రామ్ రావు, జూపల్లి శ్యామ్ రావు విరాళాన్ని అందజేశారు. ఆరెస్సెస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, ఆరెస్సెస్ నేత భాగయ్యకు చెక్కుల రూపంలో విరాళాలను ఇచ్చారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.