కాంగ్రెస్ నుంచి నగేశ్ సస్పెండ్ : వీహెచ్తో గొడవ ఇష్యూపై చర్యలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ను పార్టీ సస్పెండ్ చేసింది. వీహెచ్పై దాడి ఘటనలో క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రిత నగేశ్పై చర్యలు తీసుకున్నట్టు క్రమశిక్షణ సంఘం ప్రకటించింది.
ధర్నాలో గొడవ
ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం శనివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టింది. కోదండరాం సహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ఇంచార్జీ కుంతియా కూడా నిరసన తెలిపేందుకు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో వీహెచ్ సభ వేదికపై ప్రసంగిస్తున్నారు. కుంతియా రావడాన్ని గమనించి .. ఆయనను తీసుకురావాల్సిందిగా సూచించారు. దీంతో కిందకిదిగి నగేశ్ తీసుకొచ్చారు. అయితే కుంతియా పక్కనే కూర్చొనేందుకు ప్రయత్నించగా ... నువ్వేంటి ఇక్కడ కూర్చుంటావు, కిందకెళ్లు అని వీహెచ్ అనడంతో గొడవ మొదలైంది. కిందకెళ్లిన నగేశ్ .. వీహెచ్ కాలర్ పట్టుకున్నాడు. తర్వాత దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న కుంతియా, పొన్నం ప్రభాకర్ జరిగిన ఘటనను చూసి షాక్ తిన్నారు.
దాడిపై ఖండన
పీసీసీ చీఫ్, 3 సార్లు ఎంపీగా పనిచేసిన వీహెచ్ పై నగేశ్ దాడిని అందరూ తప్పుపట్టారు. అక్కడే ఉన్న పొన్నంతో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. జరిగిన ఘటనపై క్రమశిక్షణ కమిటీకి పొన్నం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో నగేశ్ దే తప్పని తేల్చింది. దీనిపై ఇదివరకు కోదండరెడ్డి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటామని సంకేతాలు స్పష్టంచేసింది. జరిగిన ఘటనను పరిశీలించి .. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని క్రమశిక్షణ కమిటీ తెలిపింది.
వివరణపై అసంతృప్తి
పొన్నం కమిటీ నివేదిక ఆధారంగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నగేశ్ ను ఆదేశించింది. దీంతో జరిగిన ఘటనపై లిఖితపూర్వకంగా నగేశ్ వివరణ కూడా ఇచ్చారు. అయితే ఆయన వివరణతో కమిటీ సంతృప్తి చెందలేదు. జరిగిన ఘటనలో నగేశ్ తప్పు చేశారని .. చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే కాదు ఇదివరకు ఓ సారి కూడా వీహెచ్ .. నగేశ్ మధ్య బాహా బాహీ గొడవ జరిగింది. తాజా ఘటనతో వీరి వైరం పీక్ క్ చేరింది. అయితే సభలో చొక్కా పట్టుకొని వీహెచ్ పై దాడిచేయడాన్ని పార్టీలకతీతంగా అందరూ ఖండిస్తున్నారు.