గులాబీ గూటికి నామా : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ గడ్డపై చేరికల పర్వం కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్లో వలస ప్రవాహాం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరగా, ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్లు కూడా కారెక్కారు. వీరేకాకుండా ముఖ్యనేతలు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు పోటీపడుతున్నారు. ఇవాళ టీడీపీ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మళ్లీ ఒకే ఒరలో రెండు కత్తులు..! ఖమ్మం జిల్లాలో గులాబీ ఉనికి కి మరింత ప్రమాదమేనా..?
సైకిల్ వీడి .. కారెక్కారు
ఇటీవలే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో పదవీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామాకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నామాతోపాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణకుమారి, అమర్నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తోపాటు తదితరులు పాల్గొన్నారు.
నామాకు సముచిత ప్రాధాన్యం ?
టీఆర్ఎస్లో చేరిన నామాకు పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. పార్టీలో చేరే ముందే టికెట్ల అంశంపై స్పష్టత తీసుకున్నాకే .. చేరిక ప్రక్రియ రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం
దూరంగా తుమ్మల
ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు .. నామా నాగేశ్వరరావు పార్టీలో చేరిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరిద్దరి నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టదని తెలిసిందే. గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ... ఇప్పుడు టీఆర్ఎస్లో చేరడం ఆసక్తి రేపుతోంది.