రవి ప్రకాష్ కస్టడీ పిటీషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్ట్..! సమ్మెకు మీడియా మద్దత్తు తెలపాలన్న ఆర్పీ..
హైదరాబాద్ : అలంద మీడియా కేసులో, ఎనిమిది కోట్లు దుర్వినియోగం చేశారంటూ అభియోగాలు మోపి, టీవి9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. పద్దెనిమిది కోట్లకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్ట్, కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే ఇదే కేసులో, కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేయటం, ఆ కేసులో అరెస్ట్ చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది.
కొత్తగా ఎఫ్.ఐ.ఆర్లు కూడా నమోదు చేయకుండా... ఇతరత్రా ఆరోపణలు ఉంటే ఇప్పటికే నమోదైన ఎఫ్.ఐ.ఆర్లకే జత చేయాల్సి ఉన్న పోలీసులు దురుద్దేశపూర్వకంగా అరెస్ట్కు కుట్రపన్నారని రవిప్రకాశ్ తరుపు న్యాయవాదులు ఆరోపించారు. అయితే, ఇదే కేసులో ఇప్పటికే రవిప్రకాశ్ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, నిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఆర్టీసి కార్మికుల సమ్మె గురించి రవి ప్రకాశ్ జైలు నుండి స్పందించారు. ఆర్టీసీ కార్మికుడి వైపు నిలిచిందే అసలైన మీడియా అని టీవి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా ధ్వంసం చేసి ధనస్వామ్యంగా మార్చిన వారికి ఆర్టీసీ కార్మికుల విజయమే గుణపాఠం కావలని రవి ప్రకాశ్ పిలుపునిచ్చారు. మీడియా చేసే పోరాటం దేశద్రోహులకు వ్యతిరేకంగా చేసే పోరాటమని అన్నారు.
ఆర్టీసీ సమ్మెకు రవి ప్రకాష్ జైలు నుండే తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టులు ఆర్టీసీ కార్మికుడికి భుజం కలపి నిలబడమని సందేశం పంపించారు. మీడియా కబ్జాకోరుల ఆర్టీసీ కబ్జా యత్నాలను తిప్పికొట్టాలని ఉద్బోదింరు. జర్నలిస్ట్ సంఘాలు ఆర్టీసి సమ్మెకు పూర్తి మద్దత్తు తెలియజేయాలని రవి ప్రకాశ్ విజ్ఞప్తి చేసారు.